దామరచర్ల, జూన్ 23 : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏ విభాగాన్నీ ప్రైవేట్ పరం చేయవద్దని, ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులమంతా కలిసి సమ్మె బాట పడతామని యాదాద్రి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది. వైటీపీఎస్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం నాటికి పదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ప్లాంటు ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ టీజీ జెన్కో ఉద్యోగుల రేషనలైజేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
త్వరితగతిన వైటీపీస్ ప్లాంటుకు అవసరమైన పూర్తి స్థాయి ఉద్యోగులను కేటాయించాలని, అలాగే ప్రస్తుతం జారీ చేసిన సీహెచ్పీ, ఏహెచ్పీ టెండర్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణకే ఆయువుపట్టు అయిన యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించిన సీహెచ్పి, ఏహెచ్పీ టెండర్ల ప్రక్రియపై ప్రభుత్వం పునఃసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్కో, ట్రాన్స్కో, డిసంల విద్యుత్ ఉద్యోగులంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, టెండర్లను రద్దు చేయకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్లాంట్లు పరిధిలోని విభాగాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు భారీ మొత్తంలో తగ్గిపోతాయని, ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ, నాయకులు, వైటీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రామగిరి, జూన్ 23: యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని, ‘వైటీపీఎస్ ప్రైవేటీకరణ అడ్డుకుందాం-విద్యుత్తు సవరణ బిల్లు-2025’ను వ్యతిరేకిద్దాం’ అనే కరపత్రాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ఆవిష్కరించారు. మంగళవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.335 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లాంటులోని స్టేజ్ 1,2లను ఏడాది తిరగకముందే ప్రైవేటు కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. స్టేజ్ 1,2 యూనిట్లకు సంబంధించి ఆపరేషన్, మెయింటనెన్స్, మెకానికల్, ఎలక్ట్రిక్ విభాగాలను ఉద్యోగుల కొరతను సాకుగా చూపుతూ మూడు సంవత్సరాల కాలానికి గాను ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగించేందుకు వీలుగా టెండర్లను ఆహ్వానించారన్నారు.
తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 35 వేల కోట్ల వ్యాయంతో యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రారంభించి, 80 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటుపరం చేయాలని యోచించడాన్ని సిఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులు, నిర్వాసితులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారన్నారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, డబ్బికార్ మల్లేష్, దండెంపల్లి సత్తయ్య జిల్లా సహాయ కార్యదర్శులు చింతపల్లి బయ్యన్న, ఎం.రవి నాయక్, బాణాల పరిపూర్ణాచారి, బొల్లు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.