వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించగా.. రంగంలోకి దిగిన అధికారులు నిరంతర సరఫరాలో సఫలీకృతులయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్, పల్లె, పట్టణ ప్రగతితో స్తంభాలు, వైర్ల పునరుద్ధ్దరణతో కరెంట్ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి, చౌటుప్పల్ సబ్ డివిజన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి.. సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే కరెంట్ను నిలిపివేసే విధంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో సుమారు 835 మంది విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ 24 గంటల కరెంట్ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు.
– యాదగిరిగుట్ట, జూలై 29
2014కు ముందు వర్షం వచ్చిందంటే చాలు కరెంటు పోయేది. మళ్లీ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. ఒకవేళ వచ్చినా ఎంతసేపు ఉంటదో తెలిసేది కాదు. ఇంట్లో ఉండాలంటే ఇబ్బందులు.. రాత్రి సమయంలో అంధకారమే. వ్యవసాయం చేసుకునే రైతులు నిద్రలేని రాత్రులు గడిపేది. టార్చిలైట్లు వేసుకొని బావి వద్దకు వెళ్లి వచ్చేవారు. ఎక్కడ స్తంభాలు కూలుతాయో.. వైర్లు తెగిపోతాయోనని భయాందోళన చెందేవారు. కట్టెలపై కట్టిన తీగలు, శిథిలావస్థకు చేరిన స్తంభాలతో, నాసిరకం, ఏండ్ల తరబడి మార్చని వైర్లు తెగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేది. స్తంభం పోతే కొత్తది నాటాలంటే వారం రోజులైనా పట్టేది. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక అధికారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్లు ఎత్తాలంటే భయపడేవాళ్లు. ఇటు ప్రజలు, రైతులు, అటు పై అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంత మంది అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కరెంటు పోతే వారం, పది రోజులైనా రాకపోయేది. ఇప్పుడా పరిస్థితికి చెల్లుచీటి పడింది.
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంతటి వర్షం వచ్చినా రెప్పపాటు అంతరాయం లేకుండా 24 గంటలు ఉచిత మెరుగైన విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో విద్యుత్ స్తంభాలు, వైర్ల పునరుద్ధరణ చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న స్తంభాల స్థానంలో కొత్తగా 7,122 సిమెంట్ స్తంభాలు అమర్చారు. జిల్లా వ్యాప్తంగా 430 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లు మార్చారు. తాజాగా వీధి దీపాల ఏర్పాటుకు 77.28 కిలోమీటర్ల మేర నూతన వైర్లు ఏర్పాటు చేశారు. స్తంభాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై 24 గంటలు సేవలందిస్తున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగం రోజువారి కోటా 6.65 మిలియన్ యూనిట్లు ఉన్నది. గృహావసరాలు, వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు కలిపి మొత్తం 4,25,053 కనెక్షన్లు ఉండగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నది. జిల్లాలో గృహావసరాల విద్యుత్ వినియోగం జూన్లో 27.36 మిలియన్ యూనిట్లు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా 277.33 మెగావాట్ల విద్యుత్ వినియోగంలోకి వస్తుందని అధికారులు తెలిపారు.
జిల్లాలో మొత్తం
విద్యుత్ కనెక్షన్లు 4,25,053
గృహావసరాల కనెక్షన్లు 2,63,472
వ్యవసాయ కనెక్షన్లు 1,12,531
వ్యాపార కనెక్షన్లు 36,843
పరిశ్రమల కనెక్షన్లు 3,610
చిన్నతరహా పరిశ్రమలు 1
విద్యుత్ వినియోగం 277.33 మెగావాట్లు(జూన్లో)
తగ్గిన విద్యుత్ ప్రమాదాలు
గతంతో పోలిస్తే విద్యుత్ ప్రమాదాలు భారీగా తగ్గాయి. 2014కు ముందు వర్షాకాలంలో 50 నుంచి వంద మంది వరకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. మూగజీవాలు సైతం విపరీతంగా మృత్యువాత పడేది. ప్రస్తుతం వాటి నిష్పత్తి తగ్గింది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 8మంది మృతిచెందగా, 30 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఏడాది జూన్లో ఒకరు మృతిచెందగా.. 8 జంతువులు మృత్యువాత పడ్డాయని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
అందుబాటులో 835 మంది అధికారులు
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలుగకుండా జిల్లాలోని అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. విద్యుత్ నిలిచిపోయిన ప్రాంతాన్ని తమ మొబైల్లోని వాట్సాప్ ద్వారా గుర్తించి సత్వరమే పరిష్కరిస్తున్నారు. సీపీడీసీఎల్ జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి, చౌటుప్పల్ సబ్ డివిజన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చౌటుప్పల్, భువనగిరి డివిజన్లు కలుపుకొని ఒక ఎస్ఈ, ఒక టెక్నికల్ డీఈ, ఇద్దరు డీఈలు, ఆరుగురు ఏడీఈలు, 25 మంది ఏఈలతోపాటు 600 మంది వివిధ విభాగాల అధికారులు, 200 మంది ఆర్టిజన్లు, లైన్మన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ లైన్మన్లు, జూనియర్ లైన్మన్లు కలిపి మొత్తం మొత్తం 835 మంది అందుబాటులో ఉన్నారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే సమాచారం ఇచ్చేందుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
నిరంతరాయంగా శ్రమిస్తున్నాం
రేయింబవళ్లు అందుబాటులో ఉంటున్నాం. వర్షాకాలం కావడంతో మరింత అప్రమత్తంగా ఉండడంతోపాటు సమస్య వాటిల్లితే వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 24గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రత్యేక నంబర్ను కేటాయించాం. అర్ధరాత్రి సైతం స్పందించే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశాం.
– శ్రీనాథ్, విద్యుత్ ఎస్ఈ, యాదాద్రి భువనగిరి జిల్లా