తుంగతుర్తి, ఏప్రిల్ 23 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలక్టోరల్ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలు గోదాముకు చేరేవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయని, అవి పునరావృతం కాకుండా జిల్లా, మండల, గ్రామీణ స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనవద్దని సూచించారు. జిల్లాలో పోలీస్ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు పెంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లత, సూర్యాపేట డీఎస్పీ రవి, తాసీల్దార్ రమణారెడ్డి, ఆర్ఐ వెంకటేశ్వర్రెడ్డి, తాసీల్దార్లు, ఆర్ఓలు, వీఆర్ఓలు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.