కోదాడ టౌన్/కోదాడ రూరల్, మే 6 : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా సాగర్ నుంచి పంటలకు నీరందించలేకపోయారని, ఖమ్మం జిల్లాకు నీళ్లు తరలివెళ్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సాగర్ ఆయకట్టు రైతులకు ఏనాడూ పంటలు ఎండకుండా నీరందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. రైతు బంధు అందక, రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ మళ్లీ తిరుగుతున్నారని, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారని, రాష్ట్రంలో 2014 ముందు పరిస్థితి దాపురించిందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తనకే రైతుబంధుకు దిక్కులేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతను చూపుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, మహిళలకు రూ.2,500 ఏవని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలకోరు అన్నారు. రైతులను వీధి పాలుజేసిన రేవంత్ సర్కారుకు ఓటుతో బుద్ధి చెప్పాలని, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటు వేసి నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.
నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీకి వణుకుపుట్టిందని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలను ఢిల్లీలో వినిపించే గొంతుకనవుతానని, ప్రజలకు కారు గుర్తుకు ఓటువేసి అవకాశం కల్పించాలని కోరారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులకు రైతుల పట్ల సరైన అవగాహన లేదని, వారు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి తీసుకున్న చర్యలు లేవని అన్నారు. తాము మంత్రులం అనే విషయాని మరిచి నిత్యం బీఆర్ఎస్ నాయకులపై నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తొలుత కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ, డప్పులతో అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజవర్గ సమన్వయ కర్త కటికం సత్తయ్యగౌడ్, నాయకులు సుంకరి అజయ్కుమార్, మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్రావు, కౌన్సిలర్ బెజవాడ శ్రావణ్, మేదర లలిత, ఎస్కే షఫీ, మామిడి రామారావు, ముత్తవరపు రమేశ్, కోదాటి కృష్ణయ్య, నిజాం, అప్పినాయుడు పాల్గొన్నారు.