తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. రాగి జావ పంపిణీని, మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.