సమైక్య పాలనలో ఆదరణకు నోచక ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయని, తొమ్మిదేండ్లలోనేనాణ్యమైన గుణాత్మక విద్యనందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయని
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన విద్యా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంంగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను ప్రారంభించి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత కల్పించడంతోనే నేడు సర్కారు బడులకు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు గుర్తించడమే సీఎం కేసీఆర్ విద్యా రంగంలో సాధించిన మార్పుకు సంకేతమని తెలిపారు. 2014కు ముందు ఆ తర్వాత అధ్యయనం చేస్తే విద్యా రంగంలో వచ్చిన
విప్లవాత్మకమైన మార్పులు బోధపడుతాయని చెప్పారు.
– రామగిరి, జూన్ 20
రామగిరి, జూన్ 20 : గత పాలకుల ఆదరణకు నోచని ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన గుణాత్మక విద్యనందించే కేంద్రాలుగా మారాయని, అందుకు స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని, ఇందులో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయుల కృషి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని లక్ష్మి గార్డెన్స్లో నిర్వహించిన విద్యా దినోత్సవ సంబురాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఉపాధ్యాయులు తొలిమెట్టులో భాగంగా ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం)మేళాను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయా అంశాల ప్రాధాన్యతను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభను ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కల్పిస్తున్న మౌలిక వసతుల కారణంగానే సర్కారు బడులకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన, నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారనే అంశాన్ని తల్లిదండ్రులు గుర్తించడమే సీఎం కేసీఆర్ విద్యా రంగంలో సాధించిన మార్పునకు సంకేతమన్నారు.
స్వరాష్ట్రంలో తొమ్మిది ఏండ్ల కృషి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చిందన్నారు. ఫ్రభుత్వ పాఠశాలల్లో నే అనుభవం, అర్హతలున్న ఉపాధ్యాయులున్నారన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడితో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్కారు బడిలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారనేది వాస్తవమని, అయితే ఆధునిక టెక్నాలజీతో నేటి తరం విద్యార్థులు విద్యనందించేలా ఉపాధ్యాయులు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నిదర్శనమన్నారు. ఉత్తమమైన టీఎల్ఎంను గుర్తించి వాటిని పటిష్టంగా తయారు చేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందచేయాలని కలెక్టర్, డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా రంగంలోనే కాకుండా వ్యవసాయం, తాగునీరు, కరెంట్, ఇతర విషయాల్లో ఎంతో ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, బాల మాస్టర్ శిష్యులు చేసిన సంప్రదాయ, జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా రాగిజావ, ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
20 పాఠశాలలకు ట్యాబ్స్ అందజేశారు. విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న 15 మంది ఉపాధ్యాయులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురులకుల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మన్లకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందచేసి సన్మానించారు. కలెక్టర్ వినయ్కృషారెడ్డి మాట్లాడుతూ.. గతంలో జిల్లాలో 2.19 లక్షల మంది విద్యార్థులుంటే నేడు 2.40లక్షల మంది ఉన్నారని తెలిపారు. 2014 తర్వాత మన ఊరు-మనబడి కింద 517 పాఠశాలలను ఎంపిక చేయగా 174.61కోట్ల అంచనాతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో 24 గురుకులాలుంటే నేడు 90 గురుకులాలు వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అనారు. 2014తర్వాత తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మన ఊరు-మనబడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యారంగంలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తెచ్చి పేద విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యకు అరకొర బడ్జెట్ కేటాయించే వారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యారంగం పటిష్టతకు అధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వచ్చిన మార్పులను వివరించారు. కార్యక్రమంలో అనదపు కలెక్టర్ కుష్బూగుప్తా, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, ట్రైకార్ చైర్మన్ రామచందర్నాయక్, ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్యాదవ్, డీఐఈఓ దస్రూనాయక్, గురుకుల విద్యాశాఖ ఆర్సీఓలు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.