దామరచర్ల, మే 13 : కేంద్రంలో మోదీ అసమర్థ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు తగ్గిపోయి కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు, లాభాలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయన్నారు, వేల కోట్ల రూపాయల అప్పు చేస్తూ విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దారాదత్తం చేస్తున్నారని, ప్రజలకు అవసరమైన మౌలిక సమస్యలను పట్టించుకోవడం లేదని, రైతులు కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను అమలుకు శ్రీకారం చుట్టిన మోదీ నీతి బోధనలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు, డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గించాలని సూక్తులు చెపుతున్న మోదీ మాత్రం రోడ్ షోలతో విపరీతంగా వాహనాలను వాడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు.
మోదీ ప్రభుత్వం అందించే సహకారంతోనే నేడు దేశంలోనే అంబానీ, అదానీ సంపద రోజురోజుకు పెరగడం వాస్తవం కాదా అన్నారు. మోదీ అసమర్ధమైన పాలనతోనే ఇవాళ దేశంలో సామాన్య ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు రవి నాయక్, మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, కమిటీ సభ్యులు దయానంద్, కరీం మున్నీషా పాల్గొన్నారు.