అల్పపీడన ప్రభావంతో మూడు వారాలు చల్లబడ్డ వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో 44డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 24.8 డిగ్రీలకు చేరడంతో గాలిలో తేమ శాతం తగ్గి వేడి ప్రభావం తీవ్రంగా ఉంటున్నది.
నల్లగొండ, మే 13 : అల్పపీడన ప్రభావంతో 20 రోజులపాటు చల్లబడ్డ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. గాలిలో తేమ శాతం తగ్గడంతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి ప్రభావం తీవ్రతరమవుతున్నది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు వీస్తుండడం, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నల్లగొండ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్లో ఇది అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు అయ్యింది. కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం 24.8 డిగ్రీలకు చేరడంతో వేడి ప్రభావం పెరిగింది. ఏప్రిల్ 20 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40నుంచి 41 డిగ్రీల మధ్య నమోదు కాగా, ఆ తర్వాత వరుసగా ఏర్పడ్డ అల్పపీడనాలతో వర్షం పడి వాతావరణం చల్లబడింది. దాంతో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు తగ్గాయి. అల్పపీడనాల ప్రభావం పోవడంతో ఎండలు మళ్లీ మొదలై భానుడు భగభగమంటున్నాడు.
భువనగిరి కలెక్టరేట్, మే 13 : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా సగటున 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండ మండలంలో 43.3 డిగ్రీలు నమోదు కాగా, అత్యల్పంగా బొమ్మలరామారంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకిలో 42.5డిగ్రీలు, మోత్కూరు మండలం దత్తప్పగూడెం, బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామాల్లో 41.5, ఆత్మకూర్(ఎం)లో 41.2, చౌటుప్పల్, గుండాల మండలాల్లో 40.9, అడ్డగూడూరు, మోటకొండూరు మండలాల్లో 40.8డిగ్రీలు, సంస్థాన్ నారాయణపురంలో 40.4, ఆలేరు మండలం కొలనుపాక, భువనగిరి మండలం నందనంలో 40.3డిగ్రీలు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మండలాల్లో 39.7, భూదాన్ పోచంపల్లిలో 39.5, తుర్కపల్లిలో 39.3, రాజాపేట మండలంలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సూర్యాపేట, మే 13 : జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా శనివారం 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా నేరేడుచర్ల మండలంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమితోపాటు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలోనే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అకాల వర్షాలు, తుఫాన్ ప్రభావంతో 15 రోజులపాటు వాతావరణం చల్లబడింది. మళ్లీ వారం రోజులుగా వాతావరణం వేడెక్కుతూ వస్తున్నది. 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉన్నచోట కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 34 డిగ్రీల వరకు నమోదవుతుంది. శనివారం జాజిరెడ్డిగూడెం, పెన్పహాడ్ మండలాల్లో 43 డిగ్రీలు, మద్దిరాల, మోతె, నాగారం, సూర్యాపేటలో 42.5, అనంతగిరి, ఆత్మకూర్(ఎస్), నడిగూడెం, చివ్వెంల, మఠంపల్లి మండలాల్లో 42 డిగ్రీలు, ఇతర ప్రాంతాల్లో 41నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఈ సారి ఉష్ణోగ్రతలు గతం కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ ముందస్తుగానే చెప్పినప్పటికీ అల్పపీడనాల కారణంగా ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ వేసవిలో మార్చి నుంచే టెంపరేచర్ పెరుగడం షురూ కాగా.. ఏప్రిల్ 20 నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వర్షాల ప్రభావంతో 20 రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గగా.. నాలుగైదు రోజుల నుంచి పెరుగుదల కనిపిస్తున్నది. ఈ నెల 9న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు ఉండగా.. క్రమంగా పెరుగుతూ శనివారం నాటికి 43.5 డిగ్రీలుగా నమోదై ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు అయ్యింది. శనివారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.5, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీలు నమోదైంది. మృగశిర కార్తె వరకు ఎండలు మండే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.