పెద్దఅడిశర్లపల్లి, మార్చి 1 : వానకాలం వరుణుడు కరుణించకపోవడంతో ఎగున వర్షాల్లేక నాగార్జునసాగర్లోకి వరద చేరని సంగతి తెలిసిందే. దాంతో యాసంగి సీజన్కు సాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టులో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 516.20 అడుగులకు చేరుకోగా 142 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. శుక్రవారం ఆంధ్రా తాగునీటి అవసరాల కోసమంటూ కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు ఎన్ఎస్పీ అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు.
తొమ్మిది రోజుల పాటు మరో 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో సాగర్ నీటి మట్టం మరింత వేగంగా తగ్గనున్నది. ఏఎమ్మార్పీ నుంచి నల్లగొండ జిల్లాకు, జంట నగరాలకు నిత్యం 700 పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంది. దాంతో 510 అడుగుల మేరకు మాత్రమే ఏఎమ్మార్పీ మోటార్లు నడిపే అవకాశం ఉంది. అంత మించి నీటి మట్టం తగ్గితే పుట్టంగండి జీరో పాయింట్ వద్ద అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి అప్రోచ్ కెనాల్కు ఎత్తిపోయాల్సి ఉంటుంది.
గతంలో అత్యవసర మోటార్లకు కూడా నీరు అంద ని పరిస్థితుల్లో గత ప్రభుత్వం కృష్ణా నదిలోనే కాల్వ (డ్రెడ్జింగ్ ) తవ్వకం చేపట్టి జంట నగరాల దాహార్తిని తీర్చింది. ఈ వేసవిలోనూ అలాంటి పరిస్థితులు పునరావృతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించే సుంకిశాల పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండడంతో ఈసారికి సుంకిశాల నుంచి నీటిని తరలించడం అసాధ్యం. పూర్తిగా ఏఎమ్మార్పీ నుంచే నీటిని తరలించాల్సిన పరిస్థితి. గతంలో జీరో పాయింట్ వద్ద నిర్మించిన అత్యవసర మోటార్ల షెడ్ కూడా నీటి మట్టం తగ్గడంతో తేలడం గమనార్హం.