నకిరేకల్, మార్చి 9 : నకిరేకల్ మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఆయా కాలనీల్లో నీరు అందకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని 12వ వార్డు శివాజీనగర్లో శనివారం మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాంకర్ రావడంతో స్థానికులు పోటీపడి నీళ్లు పట్టుకున్నారు.
ఈ సమయంలో తాము మొదట వచ్చామంటే తాము వచ్చామంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ కాలనీకి 18 రోజుల తర్వాత మళ్లీ ట్యాంకర్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయాలని కోరారు. బయట 20 లీటర్ల క్యాన్కు రూ.10 నుంచి రూ.20 తీసుకుంటున్నారని వాపోయారు. కనీసం మూడు నుంచి ఐదు రోజులకు ఒకసారి ట్యాంకర్ పంపించి తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.