సూర్యాపేట రూరల్/బొడ్రాయి బజార్, మే 25 : విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో, సువెన్ ఫార్మా స్యూటికల్ కంపెనీలో ఉద్యోగులు, సిబ్బందిని కలిసి రాకేశ్రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి అమలు కావాలన్నా ప్రశ్నించే గొంతుక మండలిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచందర్నాయక్, నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, తాహేర్పాషా, రమేశ్, భరత్ ఉన్నారు.