నల్లగొండ, జూన్ 10 : సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్యాంగులకు పూర్తి ఆసరాగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఆసరా పింఛన్తో ఆర్థికంగా అండగా ఉంటున్నారు. 2014కు ముందు వారికి నెలకు రూ.500 పింఛన్ ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1500కు పెంచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3,016 చేసింది. తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచి రూ.4,116కు పెంచింది. కాగా, దివ్యాంగుల పింఛన్ పెంపుపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకొన్నారు. పింఛన్ పెంచి తమ బతుకులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సున్న మారాజు అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఆసరా కింద దివ్యాంగులకు రూ.3,016 ఇస్తుండగా, దాన్ని రూ.4,116గా పెంచారు. దాంతో నల్లగొండ జిల్లాలో 31,764 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. జిల్లాలో పింఛన్ తీసుకునే దివ్యాంగులు 31,764 మంది ఉండగా.. వారికి ప్రస్తుతం ప్రతి నెలా రూ.9,58,00,224 చెల్లిస్తున్నది. వచ్చే నెల నుంచి రూ.4,1116 చొప్పున రూ.13,07,40,624 చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన పింఛన్తో ప్రతి నెలా ప్రభుత్వంపై 3,49,40,400 రూపాయల అదనపు భారం పడనుంది.
ఆసరా పింఛన్తో ఆత్మగౌరవంగా బతుకుతున్నాం
గతంలో వికలాంగులంటే చిన్నచూపు చూసేవాళ్లు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్తో ఆత్మగౌరవంగా బతుకుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం రాకముందు రూ.500 పింఛన్ ఇచ్చేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.3016కు పెంచి రాష్ట్రంలో దివ్యాంగులను గౌరవంగా బతికేలా చేశారు. కుటుంబ భారం దివ్యాంగుల మీద పడకుండా కేసీఆర్ సార్ పింఛన్ రూపంలో ఆదుకుంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మా బాధలు అర్థం చేసుకొని వెయ్యి రూపాయలు పెంచిన మనసున్న మారాజు అనిపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని దివ్యాంగులమంతా అండగా ఉంటాం.
– తీగల వెంకన్న, మాదారం కలాన్, శాలిగౌరారం
దివ్యాంగులకు కొండంత ఆసరా
మేం ఏ పనీ చేయలేకపోవడంతో కుటుంబం గడిచేందుకు చాలా కష్టంగా ఉండేది. గత ప్రభుత్వాలు రూ.500 పెన్షన్ ఇస్తే ఏ మూలకూ సరిపోయేవి కావు. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు అదో ఇదో పని చేస్తేనే పూట గడవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మాలాంటి వాళ్ల బాధను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగుల పెన్షన్ను మొదట రూ.1500కు పెంచారు. రెండోసారి ప్రభుత్వం వచ్చాక అడుగకున్నా రూ.3016 చేశారు. ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు పెంచడం ఆనందంగా ఉంది. ఈ పింఛన్ డబ్బు మాకు, మా కుటుంబాలకు కొండంత ఆసారానిస్తున్నది. మా బాధలను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వ్యవహరించిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– షేక్ నయీమ్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట
మా ఇద్దరి పింఛన్తో పిల్లలను చదివిస్తున్నాం
నా పేరు జయశంకర్, నా భార్య శ్రీదేవి. మాకు చిన్నప్పుడే పోలియో వచ్చి మా కాళ్లు అవిటిగా మారాయి. మాకు 2011లో పెళ్లి అయితే అప్పుడు నెలకు గవర్నమెంటు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేది. ఆ డబ్బుతో ఇంట్లో సరిగా ఎల్లకపోయేది. ఆ తర్వాత పాన్ షాప్ పెట్టినా అంతంతమాత్రమే ఆదాయం వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రూ.1500, ఆ తర్వాత రూ.3016 చేశారు. మా పింఛన్ డబ్బులు మా ఇద్దరి పిల్లల ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్ కొనడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మరోసారి అడుగకముందే వెయ్యి రూపాయలు పెంచడం చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరికి ఏడాదికి లక్ష రూపాయల దాకా పింఛన్ డబ్బు వస్తుంది. మమ్ములను ఇంత చక్కగా చూసుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గుండా జయశంకర్, శ్రీదేవి దంపతులు, నల్లగొండ
అందరి మనసెరిగిన మనిషి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎవరికి ఏది కావాలో వాటిని అనేక పథకాల ద్వారా అందిస్తూ ప్రజల అవసరాలను తీర్చుతున్నారు. అటు రైతులకు, ఇటు కుల వృత్తులకు జీవం పోస్తూనే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అనేక జీవితాలకు ఆసరా అవుతున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ సరిపడక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గ్రహించి మరో వెయ్యి రూపాయలు పెంచారు. వికలాంగుల గురించి ఇంత మంచిగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ అందరి మనస్సులు తెలిసిన మంచి మనిషి.
– గుర్రం నరేశ్రెడ్డి, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట
కేసీఆర్ సారు సల్లగుండాలే
తెలంగాణలో దివ్యాంగులు మూడుపూటలా తిండి తింటున్నారంటే అది సీఎం కేసీఆర్ చలవే. మాకు ఇచ్చే పింఛన్ వెయ్యి రూపాయలు పెంచి 4,116 రూపాయలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు పడిపోయాయి. అప్పటి నుంచి తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతూ వారికి భారమయ్యాను. గతంలో దివ్యాంగులకు ఇచ్చే అరకొర పింఛన్లకే లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఆ డబ్బులు మందులకు కూడా సరిపోయేవి కాదు. అప్పుడు మన పార్టీ వాడా.. కాదా? అని తెలుసుకొని పింఛన్లు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలతీతంగా అర్హులందరికీ పైరవీలు లేకుండా ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నారు. పెంచిన పింఛన్ డబ్బుతో మందులకు, ఇంటి అద్దెలకు, కుటుంబ పోషణకు అక్కరకు వస్తాయి. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను, మూడుచక్రాల బండ్లను ఉచితంగా అందిస్తూ అందరి సంక్షేమం, బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సల్లగుండాలే. ఆయనే మళ్లీ సీఎం కావాలి.
– డేగావత్ జ్యోతి, హౌసింగ్బోర్డు కాలనీ (మిర్యాలగూడ టౌన్)
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
అంగవైకల్యం.. వారి ఎదుగుదలకు అడ్డు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది. చీదరింపులకు గురవుతున్న దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నది. పెన్షన్ ఒక్కటే కాకుండా వారికి ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు ఇచ్చి అండగా నిలుస్తున్నది. వీటితోపాటు ప్రతి సంవత్సరం ప్రభుత్వం వీల్ చైర్స్, స్కూటీలు, చదువుకునే వారికి ట్యాబ్లు, ల్యాప్టాప్లు, చెవిటి వారికి ఫోన్లు, మిషన్లు.. ఇలా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నది.
– జ్యోతిపద్మ, దివ్యాంగుల సంక్షేమ జిల్లా అధికారి, సూర్యాపేట