నకిరేకల్, జనవరి 25 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం నకిరేకల్ లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో ఇందిరాగాంధీ సెంటర్లో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తాసీల్దార్ గుగులోతు ప్రసాద్నాయక్, ఎంపీడీఓ రమేశ్, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, ఎస్ఐలు గోపికృష్ణ, సుధీర్, ఎంపీఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.
మునుగోడు/ కట్టంగూర్/ నార్కట్పల్లి/శాలిగౌరారం/చిట్యాల/మర్రిగూడ /కేతేపల్లి : జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అన్ని మండలకేంద్రాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థినులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, తాసీల్దార్లు, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధాయులు పాల్గొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
దేవరకొండ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ శ్రీరాములు సూచించారు. గురువారం దేవరకొండలో స్పోర్ట్స్ అసోసియేషన్, రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ సంతోష్, ఎంఈఓ మాతృనాయక్, ఎస్ఐ సతీష్, డీటీ అనిల్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి, చింతపల్లి, చందంపేట, పీఏపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది
మిర్యాలగూడ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఆర్డీఓ బి.చెన్నయ్య అన్నారు. గురువారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. కార్యక్రమంలో తాసీల్దార్ హరిబాబు, డీటీ కల్పన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండల కేంద్రాల్లోనూ ఓటరు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు. హాలియా, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.