New Year | భువనగిరి అర్బన్, డిసెంబర్ 30 : న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేసింది. పట్టణంలోని ప్రధాన జంక్షన్ల వద్ద వెహికిల్ చెకింగ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్లు చేస్తారు. ప్రతి క్యూఆర్టీ టీమ్ల వద్ద వీడియో కెమెరాలను కలిగి ఉండి, ఎలాంటి సంఘటనలు జరిగిన రికార్డు చేస్తారు. ఈ టీమ్లు జిల్లాలోని పబ్స్, రిసార్ట్స్, హోటల్, ఫామ్ హౌస్ల వద్ద తనిఖీలు చేస్తారు. ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించి తగు జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.
క్యాబ్స్, టాక్సీ, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. అదేవిధంగా బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి. క్యాబ్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన, ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమాన విధించబడుతుంది. ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే వాహనం నంబర్, సమయం, ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ 8712662111 కు ఫిర్యాదు చేయాలి. ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఎలాంటి అదనపు ఛార్జీలు డిమాండ్ చేసిన వారిపై చర్యలు తప్పవు.
ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాశ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. సరైన పత్రాలు లేని పక్షంలో వాహనాలను తాతాలికంగా పోలీస్ వారు వారి కస్టడీలోకి తీసుకుంటారు. చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై పోలీసుల సూచనలు పాటించడంతో పాటు వాహన పత్రాలను చూపించడం వాహన డ్రైవర్ల విధి. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని నిర్బంధంలోకి తీసుకోబడును. వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరూ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయబడతారు. వాహనాల్లో అధిక డెసిబెల్ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్లను ఉపయోగించడం నిషేధించబడింది.
ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలు నిర్భందించబడి ఆర్టీఓ అధికారికి పంపబడను. నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, వాటిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్, మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై తగిన కేసులు బుక్ చేస్తారు. పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో, సురక్షితంగా ప్రయాణించాలి. మద్యం సేవించి వాహనం నడిపే ప్రతి ఒకరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని యూఎస్ 185 డిడి కేసులు బుక్ చేసి వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టుకు హాజరుపరుస్తారు. ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి, మరణానికి కారణమైతే ఐపీసీలోని యూ/ఎస్ 304 పార్ట్ సెక్షన్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.
బార్, పబ్, క్లబ్లు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. కస్టమర్లు తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై కచ్చితంగా అవగాహన కల్పించాలి. మద్యం సేవించిన వారు వాహనాలు నడపలేని పరిస్థితిలో ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి. కార్యక్రమాలు చాలా శాంతియుతంగా జరిగేలా ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మైనర్లను అనుమతించవద్దు. సందర్శకుల చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుల కాపీని సేకరించడం తప్పనిసరి.
2023 సంవత్సర వీడ్కోలు పలికి న్యూఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ర్యాస్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు చూపించకున్నా ఆ వాహనాలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్, అందులో ఉన్న వారు మద్యం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. వేడుకల్లో రోడ్లపైకి వచ్చే వారు నిబంధనలు పాటించాలి. అదేవిధంగా రిసార్ట్, పబ్స్, పార్టీలు నిర్వంచే నిర్వాహకులు కచ్చితంగా చట్టపరమైన నియమాలు పాటించాలి.
– రాజేశ్చంద్ర, భువనగిరి డీసీపీ