నల్లగొండ, ఏప్రిల్ 19: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మూడేండ్లలో ఆర్థికంగా పుంజుకున్నది. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీసీబీ సేవలను విస్తరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 బ్రాంచుల్లో బ్యాంక్ సేవలు నడుస్తుండగా తాజాగా మరో ఆరు బ్యాంకులను విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ బ్యాంకుల సేవలు ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు బ్యాంకులకు అనుమతి ఇస్తూ ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభూతి సామేల్ ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండతో పాటు పోచంపల్లి, మేళ్ల్లచెర్వు, చిట్యాల, చండూరు, రాజాపేట మండల కేంద్రాల్లో ఈ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 13 బ్యాంకులు కావాలని డీసీసీబీ యంత్రాంగం ఆర్బీఐని కోరగా ప్రస్తుతం ఆరింటికి అనుమతి ఇచ్చిన ఆర్బీఐ రెండో విడుతలో మరో ఏడు బ్యాంకులకు ఇవ్వనున్నది. 103 ఏండ్ల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం 107 సొసైటీలు, 30 బ్యాంకులతో నడుస్తున్నది.
అయితే ప్రస్తుతం ఈ బ్యాంక్ 2300 కోట్ల రూపాయల టర్నోవర్తో కొనసాగుతుండగా 3 శాతం లోపు ఎన్పీఏతో ముందుకు పోతున్నది. అందుకే బ్యాంకుల విస్తరణకు ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్రెడ్డి, జాతీయ సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీందర్రావు సహకారం వల్లే డీసీసీబీ లాభాల్లో కొనసాగుతుందన్నారు. అందువల్లే బ్యాంకుల విస్తరణకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. 15 ఏండ్లలో ఒక్క బ్యాంక్ కూడా మంజూరు కాలేదని, తమ పాలనలో మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు.