అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నామని, యావత్ దేశం నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని పేర్కొన్నారు. గురువారం సూర్యాపేటలోని పాత మిర్చి యార్డులో క్రైస్తవులకు ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకల పంపిణీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి కులమతాలకతీతంగా ఐక్యతతో పండుగలు జరుపుకొనేలా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రధాన పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని, దుస్తులు ఇచ్చి విందులు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, స్వరాష్ట్రంలో సంక్షేమ పాలన అందుతున్నదని తెలిపారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 15 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని పండుగలను ఐక్యతతో జరుపుకొంటున్న గొప్ప సంస్కృతి మనది అని, అందుకే నేడు యావత్ దేశం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని, అటువంటి నాయకత్వాన్నే నేడు యావత్ దేశం కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మిర్చి యార్డులో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, కుల, మతాల గొడవలను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందిన నీచ రాజకీయాలకు పాల్పడిన పాపం వారిదే అన్నారు. కుల, మతాలకతీతంగా అందరిలో ఐక్యత పెంచి మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో వినూత్న పథకాలతో కోట్లాది రూపాయల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
గాంధీజీ వంటి ఎందరో మహనీయులు కన్న కలలు నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారమవుతున్నాయన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా సుపరిపాలన అందిస్తున్న మనసున్న గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గతంలో పండుగలంటే కుల, మతాల పంచాయతీలు ఎక్కువగా ఉండేవని, తెలంగాణ ఏర్పాటు నుంచి అన్ని పండుగలు ఐక్యతతో జరుపుకుంటున్నామన్నారు. మళ్లీ గొడవలు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని కోరారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడిచిన ఎనిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, మున్ముందు మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నామని, ఆయా మతాల ప్రధాన పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి ఉచితంగా దుస్తులు, విందులు ఏర్పాటు చేసి ఐక్యతను పెంపొందిస్తున్నామన్నారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నియోజక వర్గం వ్యాప్తంగా వెయ్యి క్రైస్తవ కుటుంబాలకు కిస్మస్ కానుకలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, కుమారి బాబు, కౌన్సిలర్లు తాహేర్ పాషా, ఉప్పల స్వరూపారాణి, జ్యోతి కరుణాకర్, కల్లెపల్లి మహేశ్వరి, పాస్టర్లు ప్రభుదాస్, దుర్గం ప్రభాకర్, శ్యాంసన్, పౌల్, పూర్ణ శశికాంత్ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్లోబల్ క్రిస్టియన్ ఎంపోర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కాంటాంట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుప్రభు జీవితంపై నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పలువురు క్రిస్తియన్ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరై తిలకించారు.