గట్టుప్పల్, మార్చి 24 : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న గట్టుప్పల్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్పెషల్ అధికారుల పాలనతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి సంవత్సరం గడుస్తున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు.
గ్రామాల్లో సంవత్సరాల తరబడి రేషన్ కార్డ్, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ కోసం పథకం కోసం ఎదురుచూస్తున్న అర్హులకు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, కకునూరి నగేశ్, టేకుమట్ల కృష్ణ, కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ పాల్గొన్నారు.