రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను తీసుకొచ్చింది. అందులో ధరణి పోర్టల్ ఒకటి. గత పాలకుల హయాంలో అనేక మంది రైతులు భూ దందాల్లో ఇరుక్కుని ఎన్నో తంటాలు పడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కానీ.. ధరణి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. భూ సమస్యలు, ఇబ్బందుల పాలైన ఎంతో మందికి ధరణి దారిచూపింది. పోర్టల్ ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందింది. భూ సమస్య ఎంత జఠిలమైనా ఇట్టే పరిష్కరిస్తున్నది. ఎంతో మందికి మేలు చేస్తున్నది. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్ పుస్తకాలు అందించడం, వారసత్వ బదిలీలు అన్నీ చకచకా సాగిపోతున్నాయి.
– యాదాద్రి భువనగిరి, మే 27 (నమస్తే తెలంగాణ)
అవినీతి, అడ్డగోలు మోసాలకు చెక్
ధరణి డిజిటలైజేషన్ కావడంతో అవినీతికి చెక్ పడింది. యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్ర్తాల్లో మార్పులు చేస్తున్నారు. అక్రమంగా భూ యాజమాన్య హక్కులకు ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రలతోనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డుల సమస్య ఉండదు. అడ్డగోలుగా భూ రికార్డులను మార్చే వీల్లేకుండాపోయింది. ప్రైవేట్ లేదా ప్రభుత్వ భూమి అనే విషయం తెలిసిపోతుంది. ధరణితో రెవెన్యూ శాఖలో ఏండ్లుగా వేళ్లూనుకున్న అవినీతికి చెక్ పడింది. ధరణి కంటే ముందు సిబ్బందికి చేతులు తడిపితే గానీ రికార్డు చేతికందేది కాదు. పహణీ నకలు పొందడానికి తాసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి ఉండేది. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో తెలిపితే పరిష్కరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మాడ్యుల్స్ను తీసుకొస్తున్నది.
సమస్యల పరిష్కారమే నిదర్శనం
ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లాలో ఇప్పటి వరకు 75వేల దరఖాస్తులు రాగా, అందులో 73వేల అప్లికేషన్లను పరిష్కరించారు. 2500 అప్లికేషన్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం వివాదాలు, పంచాయితీలతో ఆగినవేనని అధికారులు చెబుతున్నారు. మ్యుటేషన్కు సంబంధించి 18వేల దరఖాస్తులు రాగా, 220 అప్లికేషన్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కేవలం 1.5శాతం పెండింగ్లో ఉండగా, రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సక్సేషన్కు 4800 దరఖాస్తులు రాగా, 4700 అప్లికేషన్లు క్లియరయ్యాయి.
ధరణితో దర్జాగా ఉన్నాం
ఆత్మకూర్ (ఎం) : ముఖ్యమంత్రి కేసీఆర్ తాసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ధరణితో దర్జాగా ఉన్నామని ఆత్మకూరు (ఎం) మండలం మోదుగుకుంట గ్రామానికి చెందిన మామిడి అంజిరెడ్డి, సోలిపురం ఎల్లారెడ్డి, మల్లెపూల ఉపేందర్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ధరణిపై మాట్లాడారు. గతంలో భూములు అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. అనేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆరు నెలలకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేవి. ఇప్పుడు తాసీల్దార్ కార్యాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం బాగుంది. పది నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోలు.. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుండడంతో ధరణితో రైతులు దర్జాగా ఉన్నారు. ఇలాంటివి ఎల్లకాలం కొనసాగాలి.
– రైతులు సోలిపురం ఎల్లారెడ్డ్డి, మల్లెపూల ఉపేందర్, మామిడి అంజిరెడ్డి
ధరణితో రైతులకు సత్వర సేవలు
ధరణితో రైతులకు సత్వర సేవలు అందుతున్నాయి. గతంలో రైతులు భూ సమస్యలతో చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్య దళారీ వ్యవస్థకు చరమగీతం పలికారు. ఆన్లైన్ ద్వారా ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు చేకూరడంతోపాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. గతంలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం మూలంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధరణితో సమస్యలకు చెక్ పడింది.
– రైతు, జెల్లి నర్సిహులు, ఆలేరు
పావు గంటలోపే రిజిస్ట్రేషన్ అయిపోయింది
రాజాపేట మండలంలోని బూర్గుపల్లిలో 20గుంటల భూమి కొనుగోలు చేశా. రిజిస్ట్ట్రేషన్ కోసం ఆన్లైన్లో ధరణి లాగిన్ ద్వారా నమోదు చేసుకున్నా. మధ్యాహ్నం 12 గంటలకు రిజిస్ట్రేషన్ ఉండగా కార్యాలయానికి వెళ్లాను. వెళ్లిన పావుగంటలోపే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేసి ఆన్లైన్ పాసు పుస్తకాన్ని అందజేశారు. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందనుకున్నా. వెంటనే పూర్తి చేశారు. ఆన్లైన్ చార్జీలు తప్ప ఇతర ఖర్చులు లేవు. ధరణి పోర్టల్ తీసుకురావడంతో కొనుగోలు ప్రక్రియ తొందరగా పూర్తయి పట్టా చేతికి రావడం ఎంతో ఆనందంగా ఉన్నది. ధరణితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంవంతంతోపాటు సులభతరం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– అనంతకృష్ణ, మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా
ఏండ్ల సమస్యలు పరిష్కారమవుతున్నాయి
ఒకప్పుడు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రికార్డులు ఆన్లైన్లో నమోదు కాకుండా ఉండేది. ఆన్లైన్ సరి చేసేందుకు ఏండ్ల తరబడి తిరిగినా సమస్యలు తీరేవి కాదు. కానీ.. ఇప్పుడు తాసీల్దార్ ఆఫీస్కు వచ్చిన పది నిమిషాల్లోనే అన్నీ అయిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల్లోనే ఇంటికి పాసుబుక్కు వస్తుంది. గతంలో దళారులను నమ్మి ఎన్ని డబ్బులు ఇచ్చినా సమస్యలు తీరక మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ధరణి ద్వారా సమస్యలు తీర్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఎర్రవెల్లి యాదయ్య, రైతు, జంపల్లి, బీబీనగర్
మ్యుటేషన్ తిప్పలు తప్పినయి
ధరణితో రైతుల భూముల తిప్పలు చాలా తప్పినయి. ఇప్పుడు పట్టా చేసిన క్షణాల్లోనే మ్యుటేషన్ అవుతుంది. గతంలో రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి తిరిగేటోళ్లం. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్, పాస్బుక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగేది. లంచం ఇస్తేగానీ పని అయ్యేదికాదు. నేను ఇటీవల మూడెకరాల భూమి కొన్న. దాని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేస్తే అధికారులు డేట్, టైమ్ ఇచ్చారు. అధికారులు చెప్పిన టైమ్కు పోయినం. క్షణాల్లో రిజిస్ట్రేషన్ అయిపోగానే పట్టా కాగితం ఇచ్చారు. ధరణి పుణ్యమా అని లంచాలు లేకుండా మ్యుటేషన్ అయ్యి పాస్బుక్కు ఇంటికొచ్చింది. రైతుల రిజిస్ట్రేషన్ గోసలు తీర్చడానికి ధరణి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు.
– మోటె రాములు, రైతు, వలిగొండ
ధరణితో భూముల రిజిస్ట్రేషన్ సులువు
ధరణి పోర్టల్ వచ్చినంక భూముల రిజిస్ట్రేషన్ సులువైంది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు నానా అవస్థలు పడేది. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గరకు వెళ్లి కొనుగోలు చేసిన భూమి మ్యుటేషన్ కోసం తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతుల సమస్యలను రూపుమాపడానికి ధరణి తీసుకురావడం చారిత్రాత్మకం. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజు క్రయ, విక్రయదారులు తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు వేయగానే బ్యాంకింగ్ సేవల తరహాలో విక్రయించిన వ్యక్తి ఖాతాలో నుంచి భూమి తొలగించబడి కొనుగోలు చేసిన వ్యక్తి ఖాతాలోకి భూమి జమ అవుతుంది. కొనుగోలు చేసిన వ్యక్తి పేరు వెంటనే ఆన్లైన్లో నమోదై సదరు రైతు పేరిట ఈ పాస్బుక్ జారీ అవుతుంది. భూములకు సంబంధించి 33 మాడ్యూల్స్లో వివిధ రకాల కొత్త ఆప్షన్స్ను ధరణిలో ఉంచారు. సమాచారం గోప్యంగా, భద్రంగా ఉంటుంది.
– గడ్డం స్వామి, రైతు, బురుజుబావి, గుండాల మండలం
ధరణితో పారదర్శక సేవలు
ధరణితో భూముల మ్యుటేషన్ ప్రక్రియ వెంటనే జరుగుతుంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ నుంచి డాక్యుమెంట్ వీఆర్వోలకు ఇస్తే.. వారి ద్వారా ఎమ్మార్వో ట్రాన్స్లేట్ చేసేది. మ్యుటేషన్ కోసం రెండు నెలల పాటు కార్యాలయం, వీఆర్వోల చుట్టూ తిరిగేది. ధరణితో సత్వర సేవలు అందుతున్నాయి. రైతు తన భూమి పట్టా మార్పిడి చేసుకునేందుకు సర్జన్ లాగిన్ ఓపెన్ చేసుకొని మారెట్ వ్యాల్యూ ప్రకారం స్లాట్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఆన్లైన్లో పేపర్ తీసుకొచ్చి ఎమ్మార్వో ఆఫీస్లో ఇస్తే వెంటనే పట్టా మార్పిడి జరుగుతుంది. దళారుల ప్రమేయం లేకుండా 15 రోజుల్లో పాస్ బుకు ఇంటికి వస్తుంది. పౌతికి వారసులు అందరూ వచ్చి స్టేట్మెంంట్ ఇస్తే వెంటనే అవుతుంది. పెండింగ్ మ్యుటేషన్ అయితే కలెక్టర్ ద్వారా అప్రూవల్ చేసుకోవాలి.
– బత్తుల శ్రీశైలంగౌడ్, దంతూరు, భూదాన్ పోచంపల్లి మండలం
వారంలోనే భూ సమస్య పరిష్కారమైంది
తాళ్లసింగారం గ్రామంలో నాకు రెండెకరాల భూమి ఉంది. ఆన్లైన్ ధరణి పాస్ పుస్తకంలో మొదట రెండు గుంటల భూమి తక్కువగా వచ్చింది. అధికారులను కలిస్తే వారంలో సరిచేసి ఇచ్చారు. గతంలో ధరణి రాక ముందు ఏదైనా పొరపాటు జరిగితే నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ధరణి వల్ల మాలాంటి రైతులకు ఎటువంటి నష్టాలు లేవు. ఇంతకు ముందు పాస్పుస్తకాల్లో ఉన్న దానిని, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి చాలా వరకు పొంతన ఉండకుండేది. దీనివల్ల చాలా రోజులు అధికారుల చుట్టూ తిరిగేది. ఇప్పడు ఆ సమస్యలు లేవు. అయితే.. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక ప్రత్యేక అధికారి ఉంటే బాగుంటుంది.
– బాలగోని లింగస్వామి యాదవ్, రైతు, తాళ్లసింగారం (చౌటుప్పల్ రూరల్ )