నార్కట్పల్లి, జనవరి 21 : ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. జనవరి 28న ఉత్సవం ప్రారంభమై విఘ్నేశ్వర పూజ, సాయంత్రం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, నంది వాహన సేవ, ఆదివారం ఉదయం 4గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. కొండపైన, కింద జోన్ల వారీగా పంచాయతీరాజ్ శాఖ తగినంత సిబ్బందిని నియమించి పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అవసరమైన మేరకు భక్తులకు తాగునీటి సౌకర్యం, బటర్ మిల్క్ సరఫరా చేయాలని సూచించారు. కొండపైన కింద ఉన్న 70 టాయిలెట్లకు డోర్లు, రన్నింగ్ వాటర్ అవసరమైన రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలన్నారు. మిషన భగీరథ శాఖతో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏజెన్సీలు పరిశుభ్రం చేసేలా పర్యవేక్షించాలన్నారు.
మెయిన్ పార్కింగ్ వద్ద 10, పార్కింగ్2 వద్ద 5టాయిలెట్లు, బస్టాండ్ వద్ద 6, జీపీ కార్యాలయం వద్ద 4, హోల్డింగ్ పాయింట్ వద్ద 5 తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్ శాఖ టీమ్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణకు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శాఖతో మెడికల్ క్యాంపులు, అగ్నిమాపక శాఖ అగ్నిమాపక వాహనం, సిబ్బంది ప్రమాదాల నివారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చేపట్టాల్సిన పనులపై ఆయా శాఖలకు సూచనలు చేశారు. సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ముఖ్యమైన అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను కలెక్టర్కు వివరించారు.ఆయన వెంట అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీపీఆర్ఓ పి.నర్సింహారెడ్డి, డీపీఓ విష్ణువర్దన్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డీఎం నాగేశ్వర్రావు, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ముజీబుద్దీన్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మహేంద్రకుమార్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బాలశౌరి, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నవీన్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.