యాదగిరిగుట్ట, అక్టోబర్ 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండకింద నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో పుణ్య స్నానమాచరించి పులకరించిపోయారు. కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణపుష్పార్చన నిర్వహించారు. లక్ష్మీనారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయం చెంతన గల క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామివారికి ఆకుపూజ ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. కొండపైన వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు, పురోహితులు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.25,73, 422 ఆదాయం సమకూరిందని ఈఓ గీత, అనువంశికధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు.
గుట్టలో దసరా వేడుకలు
స్వామివారి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో విజయదశమి సందర్భంగా మంగళవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించా రు. శమీ పూజలు చేసి జమ్మి చెట్టుకు పూజలు చేపట్టారు. అనంతరం గజవాహన సేవ, ఆయుధపూ జ నిర్వహించారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవా లు సోమవారం వైభవంగా ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈఓ గీత, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు.