యాదాద్రి భువనగిరి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.50కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. మౌలిక వసతులు, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నది. పట్టణంలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది. 10శాతం గ్రీన్ బడ్జెట్, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు, వైకుంఠధామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు, పార్కులు తదితర నిర్మాణాలతో కొత్తరూపు సంతరించుకున్నది. సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, ఎవెన్యూ ప్లాంటేషన్తో పోచంపల్లి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా మారిన భూదాన్ పోచంపల్లి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నర్సరీలు, ప్రకృతి వనాలతో పచ్చదనం పరిఢవిల్లుతుండగా.. గల్లీగల్లీకి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పరిశుభ్రంగా కనిపిస్తున్నది. అనేక వసతులు మెరుగుపడి ప్రపంచ పర్యాటక ప్రాంతం కొత్త రూపును సంతరించున్నది.
పట్టణ ప్రగతితో అద్భుతంగా..
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పోచంపల్లి పట్టణానికి రూ.5.74కోట్లు మంజూరు చేసింది. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేసింది. దీని ద్వారా పట్టణంలో మూడు నర్సరీలు, 13 పట్టణ ప్రకృతి వనాలు, ఒక ఫ్రీడం పార్కు, 12కిలోమీటర్ల మేర ఎవెన్యూ, మీడియన్, ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ చేపట్టి.. పట్టణాన్ని సుందర వనంగా మార్చారు. ప్రధాన రహదారి మీడియన్లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్తో పట్టణ రూపురేఖలు మారాయి. పారిశుధ్య నిర్వహణకు ఏడు వాహనాలను కొనుగోలు చేశారు. ఫలితంగా పట్టణంలో పరిశుభ్రత మెరుగుపడింది. మున్సిపల్ పరిధిలో ఉన్న జలాల్పూర్లో కంపోస్ట్ షెడ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని పొడి చెత్తను వేరు చేసి దాని ద్వారా రెవెన్యూ పొందడానికి డీఆర్సీసీ సెంటర్, కొత్తగూడెం రోడ్డులో మున్సిపల్ స్థలంలో సీ అండ్ డీ వేస్ట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. పట్టణంలో 2014కు ముందు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు రూ.25లక్షలతో 15 ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. మల వ్యర్థాలను సురక్షితంగా శుద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.90లక్షలతో 15కేఎల్డీ సామర్థ్యంతో ఎఫ్ఎస్టీపీ మంజూరు చేసింది.
తీరిన నీటి బాధలు..
గతంలో నీటి కోసం కొట్లాడిన చేతులు ఇప్పుడు ఇంట్లోనే హాయిగా తాగునీటిని పట్టుకుంటున్నాయి. తాగునీటి కోసం అల్లాడిన గొంతులు ఇప్పుడు మిషన్ భగీరథ నీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. వీధి కుళాయిలు తొలగించి, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, నీటి కొట్లాటతోపాటు నీటి ఎద్దడికి చెక్ పెట్టింది. నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించింది. పట్టణంలో 3,606 కుటుంబాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడం కోసం 6 జీఎల్ఎస్ఆర్ ఏర్పాటు చేసింది. 60.71 కి.మీ. మేర పైప్లైన్లను అభివృద్ధి చేసింది. తద్వారా పట్టణంలో 4,774 కుటుంబాలకు నల్లా కనెక్షన్తో సురక్షిత తాగునీరు అందుతున్నది.
గల్లీగల్లీకి సీసీ రోడ్లు..
మౌలిక వసతుల్లో భాగంగా టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా పట్టణానికి రూ.26.5కోట్లు మంజూరయ్యాయి. వీటిల్లో 6.35 కోట్ల రూపాయలతో పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రూ.10.77 కోట్లతో పట్టణ పరిధిలోని 13వార్డుల్లో 19 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.2.18 కోట్లతో 35 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.70లక్షలతో పట్టణంలో పార్కు ఏర్పాటు చేసేందుకు టెండర్ పూర్తయ్యింది. త్వరలోనే పనులు చేపట్టనున్నారు. రూ.6.50 కోట్లతో వార్డుల్లో అవుట్లెట్ డ్రైనేజీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా ఎస్డీఎఫ్ నిధులు రూ.5.15 కోట్లతో 13వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఇందిరానగర్ కాలనీలో అంబేద్కర్ కళాభవన్ నిర్మించేందుకు రూ.20లక్షలు మంజూరయ్యాయి.
కోటితో వైకుంఠధామం..
గతంలో శ్మశాన వాటికల్లో సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో వైకుంఠధామాలను నిర్మించి అనేక సదుపాయాలు కల్పించారు. శ్మశానాలంటే భయపడే స్థితిలో నుంచి పార్కుల్లో తిరిగినట్లు.. ఆలయాలకు వెళ్లినట్లుగా వైకుంఠధామాన్ని తీర్చిదిద్దుతున్నారు. పోచంపల్లి పట్టణంలో కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మాణం పూర్తి కావస్తున్నది. రూ.15.35లక్షలతో స్వర్గపురి వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కొత్త వైకుంఠధామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడుతున్నది. ఎటు చూసినా పచ్చదనమే. మధ్యలో శివుని విగ్రహం ఏర్పాటు చేశారు. దహన సంస్కారం సమయంలో కూర్చునేందుకు మోడ్రన్ గ్యాలరీ, ప్రత్యేక క్షౌరశాల, అందులోనూ కుర్చీలు, అద్దాలను ఏర్పాటు చేశారు.
టీఎస్ బీపాస్ చట్టం – 2020 వ్యవస్థలో ఓ మార్పును తీసుకొచ్చింది. తక్షణ అనుమతులు, ఆమోదాలు, ఆన్లైన్ ధ్రువీకరణ కోసం ఒకే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫారంలో బిల్డింగ్, లేవుట్ అప్రూవల్స్తో సరికొత్త రికార్డు సృష్టించింది. టీఎస్ బీపాస్ ద్వారా ఇప్పటి వరకు 178 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ఇంటి పన్ను, నీటి పన్నులు, ఇంటి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, జనన, మరణ ధ్రువపత్రాలు తదితర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు రూ.3.30 కోట్ల ఇంటి పన్నులు వసూలయ్యాయి.
ఇంకా మరెన్నో కార్యక్రమాలు..