విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత్సరంలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతి రెండు నెలలకోసారి ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) సమావేశాలు నిర్వహిస్తుండగా 2023-24 నుంచి ప్రతి నెలా 3వ శనివారం పీటీఎం నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,181 పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు జరుగనున్నాయి.
-రామగిరి, జనవరి 17
అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలను కొన్నింటికి ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వం, విద్యాశాఖ అమలు చేసే విద్యా క్యాలెండర్లోని అంశాలను పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యం అమలయ్యేలా చూడాలి.
నల్లగొండ జిల్లాలో 1,482, సూర్యాపేటలో 918, యాదాద్రి భువనగిరి జిల్లాలో 781 పాఠశాలలు ఉండగా వీటన్నింటిలో పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. ఎస్ఎంసీతోపాటు పీటీఎం సమావేశాలు విధిగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రధానోపాధ్యాయుడు ముందుగా సమావేశమై పీటీఎం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు వంద మంది హాజరయ్యేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలి. నెలవారీ ఎజెండా ప్రకారం చర్చ జరిపేలా చూడాలి. ప్రతి సమావేశంలో చేసిన తీర్మానాలను రిజిస్టర్లో నమోదు చేసి తదుపరి సమావేశంలో సమీక్షించాలి.
తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలు గుర్తించి ప్రొఫైల్స్ తయారు చేయాలి. విద్యార్థుల ప్రగతి తెలుపుతూ పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, ఇన్స్పైర్, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్స్, ఆన్లైన్ క్విజ్ గురించి తెలియజేయాలి. విద్యార్థుల విద్యాపరమైన, సాంస్కృతిక, ఆరోగ్య, మానసిక స్థితిగతులు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు మొదలైన వాటిని గుర్తించి చర్చించాలి. అధికారులు నిరంతరం పాఠశాలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి.
పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేందుకు విద్యాశాఖ పీటీఎం సమావేశాల నిర్వహణ కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల 3వ శనివారం పీటీఎం నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో చర్చించిన అంశాలను ఎజెండా ప్రకారం చర్చించి నివేదికను ఎమ్మార్సీలో సమర్పించాలి. అలాగే మీటింగ్ ఫొటోలను విధిగా ఉన్నతాధికారులకు పంపించాలి. విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంది.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ