Singer Neha Bhasin | నీట్ 2026 పరీక్షల లీకేజీ అవకతవకలపై జరిగిన నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వాడిన బూతు మాటలను ఖండిస్తూ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వీడియోపై ప్రముఖ గాయని నేహా భాసిన్ తీవ్రంగా స్పందిస్తూ భూమి పెడ్నేకర్ను విమర్శించారు. నిరసనకారులైన విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన దౌర్జన్యాలు, లాఠీచార్జీలు మరియు మహిళా ఆందోళనకారుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తన గురించి భూమి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు నేహా భాసిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. భూమి వ్యాఖ్యలన్నీ పూర్తిగా స్క్రిప్టెడ్ అని మండిపడ్డారు. ధైర్యం లేనప్పుడు మౌనంగా ఉండటమే మేలని, దేశంలో వేళ్లూనుకున్న అవినీతి, ఆర్థిక సంక్షోభం, యువతపై జరుగుతున్న దాడులను విస్మరించి కేవలం సంస్కారాల గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
దేశ రాజధాని దిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, సాదా దుస్తుల్లో ఉన్న పోలీసులు మహిళా నిరసనకారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోలీసుల చర్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ, భూమి పెడ్నేకర్ కేవలం ప్రధానిని ఉద్దేశించి వాడిన పదజాలాన్ని మాత్రమే తప్పుబట్టడం పట్ల నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో యువత పట్ల పోలీసులు ప్రదర్శించిన హింసపై సెలబ్రిటీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని నేహా భాసిన్ ప్రశ్నించడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.