పెద్దఅడిశర్లపల్లి, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేవరకొండ ఖిలాపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేయడంతో దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేశారన్నారు. ఇన్ని రోజులు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్టు వచ్చి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మరోసారి మోస పోవద్దన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, నాయకులు ముచ్చర్ల ఏడుకొండల్యాదవ్, తోటకూరి పరమేశ్, యాదాద్రి ఎన్ఫ్రా చైర్మన్ ముచ్చర్ల శ్రీకాంత్యాదవ్, కర్ణయ్య నాయకులు పాల్గొన్నారు.
ధర్మాపురం లచ్చయ్య బుధవారం మృతి చెందగా.. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.