దామరచర్ల, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన మంత్రులు యాదాద్రి పవర్ప్లాంట్లో ఉదయం 10:32 గంటలకు ల్యాండ్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బీఎల్ఆర్తోపాటు అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు కాన్వాయ్లో సైట్ విజిట్ చేశారు. 10:52 గంటలకు మీటింగ్ హాల్కు చేరుకోగా జెన్కో భద్రతా సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జెన్కో అధికారులతో 10:55 నుంచి 12:16 గంటల వరకు మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్లాంట్ ప్రగతి, పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెలుపలికి రాగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్కు చెందిన 270 మంది ఓఅండ్ఎం కార్మికులు వారిని కలిసి ఇక్కడ తమకు సరైన వసతులు, పనులు లేవని, తిరిగి తమను పాల్వంచకు బదిలీ చేయాలని వినతి పత్రం అందజేశారు. వారితోపాటు పవర్ప్లాంటులో భూములు కోల్పోయిన కొంత మంది నష్టపరిహారం అందలేదని, భూనిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. రైల్వేలైన్ కింద భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వినతిపత్రాలు అందజేశారు. అనంతరం 12:25 గంటలకు మంత్రులు హెలికాప్టర్లో మేళ్లచెర్వుకు బయల్దేరారు. కార్యక్రమంలో జెన్కో సీఎండీ రిజ్వీ, జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డైరెక్టర్ అజయ్, ప్లాంటు సీఈ సమ్మయ్య, ఆర్డీఓ చెన్నయ్య, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా ప్లాంట్ వద్దకు చేరుకున్న స్థానిక నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.