నీలగిరి, మార్చి 04 : పోలీస్ లాకప్ డెత్ లో మరణించిన కర్ల రాజేశ్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి, డీఎస్పీ జి.రవిని ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నా రాజేశ్ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం జరిగిందన్నారు. ఇక దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదన్నారు. ఇప్పటికైనా అధికారులు కేసు విచారణ వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఆదివారం వరకు పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారని కృష్ణ మాదిగ వెల్లడించారు. అయితే విచారణ ఆలస్యం చేస్తే వదిలేస్తారని డిపార్ట్మెంట్ అధికారులు అనుకుంటే అది పొరపాటేనని, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా విచారణ చేసే అధికారులు నల్లగొండ జిల్లాలో ఉన్నారు కావునా ఆ ఉద్యమాన్ని ఇక్కడ కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకే నాలుగు రోజులు ఎదురు చూసి సోమవారం తర్వాత ఉద్యమాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుండి భర్తీ చేయనున్న రాజ్యసభ సభ్యుల ఎంపికలో మాదిగలకు ఒక సీటు కేటాయించాలని పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. గతంలో తెలంగాణ నుండి రెండు పార్లమెంట్ స్థానాల్లో మాదిగలు ఉన్నప్పటికీ, రాజ్యసభలో కూడా ఇద్దరు మాదిగలకు అవకాశం కల్పించాలన్నారు. మాదిగల వల్లే రాజకీయ భవిష్యత్ లభించిందని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి నుండి సీఎం అయ్యేవరకు ప్రతి సందర్భంలోనూ మాదిగలకు అన్యాయం చేశారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో కూడా మాదిగలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. ఇప్పటివరకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకైనా సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ సీటు మాదిగలకు దక్కేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మాదిగల నుండి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర నాయకుడు మేడి శంకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఏడుకొండలు, ఎరసాని గోపాల్, కూరపాటి కమలమ్మ పాల్గొన్నారు.