సూర్యాపేట, నవంబర్ 24 : ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశ నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరైందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిండన్నారు. ఆ దీక్షతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అందుకే ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్ను నిర్వహించుకోనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యంగా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోకాపేటలో ఎకరం రూ.100 కోట్ల నుండి రూ.170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్ధమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వ భూముల కుంభకోణంపై వచ్చే తమ ప్రభుత్వంలో విచారణ తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని, భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. ధాన్యం కొనుగోళ్లలోనూ చాలా గోల్ మాల్ జరుగుతుందన్నారు. ఐకెపి సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదని, మ్యాచ్చర్ వస్తలేదని రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని, మళ్లీ 2014 ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసిందన్నారు. రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. తెలిసే మోసం చేసి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుందన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ఉంది బీసీల పరిస్థితి అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అందుకు అనేక చోట్ల బీసీలకు జీరో రిజర్వేషన్లు రావడమే నిదర్శనం అన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తదని స్పష్టం చేశారు. బీసీలతో పాటు అన్ని రంగాల ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. కేసీఆర్ని వదులుకున్నామన్న భావన అందరిలో కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ విజయకేతనం తప్పదన్నారు. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగులు లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహా రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు పాల్గొన్నారు.