యాదగిరిగుట్ట, మార్చి15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం నిత్య పూజల అనంతరం స్వామివారిని శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణుడు)గా అలంకారంలో ముస్తాబు చేశారు. రాత్రి కల్పవృక్ష సమానమైన పొన్న వాహనంపై అధిష్టింపజేసి తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. లక్ష్మీనరసింహస్వామి శనివారం ఉదయం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి సింహవాహనంపై ఊరేగింపు ఉంటుంది.
మెడలో స్వర్ణ, వజ్ర, ముత్యాల ఆభరణాలు.. చేతిలో సుమధుర గానామృతాన్ని పంచే పిల్లనగ్రోవి.. ఒంటిపై పట్టుపీతాంబరాలు.. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించిన దివ్య మంగళ రూపులో సకల జనావళిని సమ్మోహనం చేస్తూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శ్రీకృష్ణావతారం(మురళీకృష్ణుడు)లో దర్శనమిచ్చారు. లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఐదో శుక్రవారం ఉదయం నిత్యపూజల అనంతరం స్వామివారు శ్రీకృష్ణాలంకారంలో పెండ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. ఈ సందర్భంగా వేద, పురాణ, ఇతిహాస ప్రవచనాలను అర్చకులు స్తుతించారు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి మహోత్సవం, ప్రధానాలయం తిరుమాఢవీధుల్లో స్వామివారి ఊరేగింపు సేవను అత్యంత వైభవంగా చేపట్టారు. తూర్పు మాఢవీధుల్లోని ప్రత్యేక మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, శ్రీకృష్ణాలంకారం యొక్క సూక్తులను పఠించారు. దివ్య ప్రబంధంలోని అలంకార వైభవ పాశురాలను పఠిస్తూ స్వామివారి అలంకార విశిష్టతను ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు వివరించారు. భగవానుడి అవతారాల్లో దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ గావించిన అపూర్వమైన అవతారమే శ్రీకృష్ణావతారం. ఎన్నో అద్భుతాలను దర్శింపజేసిన కృష్ణావతారంలో మురళీకృష్ణుడిగా తన దివ్యమైన వేణుగాననాదంతో సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని అందించిన అపూర్వ స్వరూపమని సర్వదా స్మరణీయమని పేర్కొన్నారు.మురళీకృష్ణుడి సేవలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. స్వామివారి సేవను మోస్తూ తిరుమాఢవీధుల్లో తిరిగారు. రాత్రి ప్రధానాలయంలో నిత్యకైంకర్యాల అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రఘు, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
పొన్న వృక్షమును దేవ వృక్షంగా పురాణాలు పేర్కొన్నాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. అందుకే దానికి కల్పవృక్షమని పేరు. ‘కల్పయతి వాంఛిత మితి’ అనగా కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు అని అర్థం. సకల చరాచర జగత్తంతా మహావృక్షం వంటిది. అలాంటి సంసారమనే మహావృక్షానికి బీజం పరమాత్మ ప్రకృతిలోని ప్రతితత్వం పరమాత్మకు చెందినదేనని ‘భక్తాభీష్ట వరప్రదాయని అయిన స్వామివారు పొన్నవృక్షారూఢుడై భక్తులను దర్శనమిచ్చారని ఆలయ ప్రధానార్చకులు వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాత భేరీ, ఆస్థానం వారి మంగళవాయిద్యం, వైదిక ప్రార్థనలు కొనసాగాయి. హైదరాబాద్కు చెందిన శ్రీసాయిబాబా సేవా సమితి , భూదాన్పోచంపల్లికి చెందిన శ్రీలక్ష్మీనారాయణ భక్తభజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి మహిళా భజనామండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన శ్రీమసన చెన్నప్ప వారి ఉపన్యాసం, అల్లం కనకదుర్గ భాగవతారణితో భక్త ప్రహ్లాద హరికథ, జనగామకు చెందిన కొండూరి పద్మావతి బృందం వారితో శ్రీనరసింహ సహస్రనామసోత్ర పారాయణం గావించారు. సాయంత్రం హైదరాబాద్కు చెందిన ఇందిర, రాధిక మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీ, విష్ణుప్రియతో భక్తి సంగీతం, తూడూరి రేణుక, సౌందర్యకౌశిక్, కుమారి స్వతంత్ర కృష్ణ, అన్నదానం శ్రీసహస్ర బృందం, కుమారి ప్రణుతి అదర్శిని వారితో కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జనగామకు చెందిన చంద్రకళానిలయం వారిచే పేరిణి నృత్యం ఆకట్టుకున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పారాయణికుడికి గాయాలయ్యా యి. మురళీకృష్ణుడి సేవను తూర్పు మాఢవీధుల్లో వేంచేపు చేసే క్రమంలో అక్కడే ఉన్న మీడియా వైర్లు కాలికి తగలడంతో పక్కనే ఉన్న సౌండ్ బాక్స్ పారాయణందారుడి కాలిపై పడింది. దాంతో ఆయన కాలికి తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు వచ్చి ప్రధమ చికిత్సను చేసి, స్థానిక దవాఖానకు తరలించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి శనివారం ఉదయం గోవర్ధనగిరిధారిగా దర్శనం ఇవ్వనున్నారు. రాత్రికి సింహవాహనంపై తిరుమాఢవీధుల్లో ఉరేగనున్నారు.