బడుగు, బహుజన వర్గాలకు చెందిన వారిని గుర్తించి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని, యాదవుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని అఖిల భారత యాదవ మహాసభ ముఖ్యులు స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా యాదవులకు పెద్దపీట వేస్తూ సముచిత స్థానం కల్పిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కృషి గొప్పదని పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన యాదవ మహాసభ ముఖ్యులు సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులకు రాజకీయంగా ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి యాదవులను దూరం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, దాన్ని తిప్పి కొట్టి ఉమ్మడి జిల్లాలో 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తామని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోమారు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని అఖిల భారత యాదవ మహాసభ ముఖ్యులు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లకు సీట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ పెద్దలు మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులను రాజకీయంగా ద్రోహం చేసిన యాదవ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని.. ఆపార్టీ ఎన్నడూ యాదవులకు ఏమీ చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. అలాంటి యాదవ విద్రోహ కాంగ్రెస్ను నేడు యాదవులకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయాలనే కుట్ర చేస్తుందని విమర్శించారు. 2018 లో యాదవులకు ఒకే ఒక అసెంభ్లీ సీటు కేటాయించిన కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని మండి పడ్డారు.
2014లో కూడా పోటీ చేసి న నలుగురు యాదవులకు చేయ్యిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 2018 కూడా కాంగ్రెస్, టీడీపీ కూటమిలో యాదవులకు దక్కాల్సిన స్థానంలో అగ్ర వర్ణాలకు సీటు కేటాయించి తీరని అన్యా యం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రను యాదవులు మరిచిపోవద్దన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యా దవులకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డిలకు రాబోయే ఎన్నికల్లో 12 కు 12 అసెంబ్లీ సీట్లు గెలిపించి బహుమతిగా ఇస్తామన్నారు. బలహీన వర్గాల, యాదవ వ్యతిరేకి అని కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు,బలహీన వర్గాలకు గుర్తింపు లభించిందన్నారు. యాదవులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం జరిగిందన్నారు. 2018 ఎన్నికల్లో 5 అసెంబ్లీ సీట్లు, రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ సీటు ఇవ్వడమే బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు యాదవుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోత్సాహం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారని తెలిపారు. ఇవ్వన్నీ మంత్రి జగదీశ్ రెడ్డి యాదవ పక్షపాతి అనడానికి నిదర్శనం అన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్కు టికెట్ ఇప్పించి గెలిపించడంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాత్ర ఎనలేనిది అన్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బడుగుల లింగ య్య యాదవ్ను నియమించడం జగదీశ్రెడ్డికి యాదవులపై ఉన్న ప్రేమకు నిలువుటద్దమన్నారు. మంత్రి ప్రోత్సాహంతో డీసీఎంఎస్ చైర్మన్గా వట్టె జానయ్య యాదవ్ను నియమించడం జరిగిందన్నారు. అలాగే 3 మార్కెట్ కమిటీలకు యాదవులను నియమించడం ద్వారా యాదవులపై జగదీశ్రెడ్డికి ఉన్న ప్రేమ అందరికీ అర్ధమవుతుందన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దలు, యాదవ ప్రజాప్రతినిధులు మంత్రి జగదీశ్ రెడ్డిని గజమాల, శాలువా, బొకేలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధయాదవ్, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు యాదవ్, రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, దావుల వీరప్రసాద్ యాద వ్, సుధాకర్ యాదవ్, బాలరాజు యాదవ్, చిన్న మల్లయ్య యాదవ్, కడారు అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.