నల్లగొండ, డిసెంబర్ 16 : ప్రాథమిక సహకార సంఘాలను మల్టీ సర్వీసింగ్ సెంటర్లు(ఎంఎస్సీ)గా మార్చేందుకు మరికొన్ని సంఘాలకు అవకాశమిస్తూ నాబార్డు ఈ పథకాన్ని మరో మూడేండ్లు పొడిగించినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఎంఎస్సీపై ఆయా సహకార బ్యాంకుల మేనేజర్లు, పీఏసీఎస్ సీఈఓలకు నిర్వంచిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రాథమిక సహకార సంఘాలను మల్టీ సర్వీసింగ్ కేంద్రాలుగా మార్చి పలు రంగాలకు రుణ వితరణ చేసేందుకు నాబార్డు గత మూడేండ్ల కింద ఈ పథకాన్ని ప్రారంభించగా, దీన్ని మరో మూడేండ్లు పొడిగించడం సంతోషకరమన్నారు. మొదటి దఫాగా జిల్లాలో 50 సంఘాలకు రుణాలు ఇచ్చి ఈ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈసారి మరికొన్ని సంఘాలకు రుణాలు ఇచ్చి ఆయా సంఘాలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను నాలుగు శాతం వడ్డీ ఉండగా, అందులో మూడు శాతం రిబేటు పోగా ఒక్క శాతం మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే ఈసారి ఈ పథకంలో మరిన్ని సర్వీసులను పెంచి నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మీ సేవలతోపాటు హైక్లినిక్స్, కర్షక్ మిత్ర ద్వారా మల్టీ రుణాలు ఇచ్చేలా నాబార్డు ప్రణాళికలు రూపొందించినందున ఆ దిశగా ఆయా సంఘాల ద్వారా ఈ రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్సీ కోఆర్డినేటర్ షరీఫ్, నాబార్డు ఏజీఎం బ్రిజేశ్, సతీష్ చంద్ర, ఇన్చార్జి సీఈఓ వసంతరావు, డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి పాల్గొన్నారు.