బొడ్రాయిబజార్, జూలై 3 : కనుమరుగవుతున్న నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసి నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సూర్యాపేట మున్సిపాల్టీ తనవంతు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సూర్యాపేట పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణ ప్రగతి నిధులు రూ.55లక్షలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల డివైడర్లు, ఫ్లై ఓవర్ కింద, చుట్టూ గోడలపై అందమైన రంగురంగుల బొమ్మలు వేసి కొత్త కళను తీసుకొచ్చింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఫ్లై ఓవర్ కింద వేసిన బతుకమ్మలతో వచ్చే మహిళలు, పల్లెల్లో చిన్నారుల ఆటలు, కోయిల కూతల వంటి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
జిల్లాలోని ప్రముఖ సందర్శన స్థలాలైన పిల్లలమర్రి దేవాలయం, పెద్దగట్టు లింగమంతులస్వామి దేవస్థానం, జాన్పహాడ్ దర్గా, ఏండ్ల నాటి బాప్టిస్టు చర్చి చిత్రాలు భావితరాలకు పరిచయం అవుతూ స్థానిక సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఇవేకాకుండా డివైడర్, ఫ్లైఓవర్ గోడలపై వేసిన వర్లీ పెయింట్స్ అంటే రెడిమిక్స్ కలర్పై తెల్లటి గీతల మాదిరిగా వేసిన పల్లె వాతావరణం, పెండ్లి తంతు, నాటి ఆటల చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేటకు నిత్యం వేలాది మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. వారు పట్టణంలోని ఫ్లై ఓవర్లపై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ వేసిన చిత్రాలను చూసి అబ్బురపడుతున్నారు. వాటి వద్ద ఫొటోలు దిగి సంబురపడుతున్నారు.
శ్రమకు తగ్గ గుర్తింపు..
వర్లీ పెయింట్స్ వేయడం చాలా శ్రమతో కూడుకున్నది. ఈ పని మొత్తం పై భాగాన కర్రలపై నిలబడి చేయాల్సి ఉంటుంది. రంగులు ఎంచుకోవడం నుంచి ఎంతో శ్రమ పడి వేశాం. చిత్రాలన్నీ చక్కగా కుదిరాయి. వచ్చిపోయేవారు, అధికారులు చాలా చక్కగా ఉన్నాయంటూ ప్రశంసించారు. మా శ్రమకు తగిన ఫలితం దక్కడం ఆనందంగా ఉన్నది.
– మధు, మనో ఆర్ట్స్
చిత్రాలన్నీ అద్భుతంగా కుదిరాయి
మన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను ఫ్లై ఓవర్ కింది భాగంలో, బయట వేశాం. మేము వేసిన చిత్రాలన్నీ చక్కగా కుదిరాయి. సరైన రంగులను ఎంచుకొని ప్రతి చిత్రాన్ని మానవీయంగా తీర్చిదిద్దాం. నేటి తరానికి పల్లె వాతావరణం, సందర్శన స్థలాలను పెయింటింగ్ రూపంలో తెలియజేసే అవకాశం మాకు రావడం చాలా సంతోషంగా ఉన్నది.
– వెంకన్న, రఘు ఆర్ట్స్