నీలగిరి, ఫిబ్రవరి 8 : దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడి గ్రౌండింగ్ చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారులతో నల్లగొండ పెద్ద గడియారం సెంటర్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో 1055, తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో 270 మందిని దళిత బంధు పథకం కింద ఎంపిక చేశారని తెలిపారు.
ఎంపికైన లబ్ధిదారులకు విడుదల చేసిన నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా పారదర్శకంగా చేశారని, ప్రక్రియను వేగవంతంగా చేసి నిధులు విడుదల చేయాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు ఎలా కొనసాగిస్తున్నారో అదే తరహాలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బడుపుల శంకర్, అద్దంకి రవీందర్, గాదె నరసింహ, కట్టెల శివకుమార్, మామిడి రమేశ్, పోతెపాక నవీన్, పిచ్చయ్య, నాగయ్య, బొల్లు రవీందర్, బొల్లెద్దు నాగయ్య, సైదులు, కిన్నెర అంజి, యన్నమల్ల వెంకటేశం, మైనం నాగేంద్ర, గోలి రమేశ్, యాదయ్య పాల్గొన్నారు.