సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 12 ; పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ కార్యాచరణ చేపడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే స్కూళ్లలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్ఏ -1లో వచ్చిన మార్కుల ఆధారంగా వారికి పాఠ్యాంశాల్లో మెళకువలు చెప్తున్నారు. జనవరి నుంచి పాఠాలను పునఃశ్చరణ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు.
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. కార్యాచరణలో భాగంగా డిసెంబర్ 31 వరకు సిలబస్ పూర్తి చేసేందుకు సూర్యాపేట జిల్లాలోని 238 ప్రభుత్వ పాఠశాలలైన జడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రతిరోజూ అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటుచేసి ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నారు. 100 శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే అధికారులు ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వారి సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉండడంతో సాధ్యమైనంత వరకు వాటిని అమలు చేయాలని సూచించింది. జిల్లాలోని 238 పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల కోసం జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు.
31 నాటికి సిలబస్ పూర్తయ్యేలా చర్యలు..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన ప్రణాళికను ఇప్పటికే జిల్లాలోని 238 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా వెనుకబడిన విద్యార్థులను ఎస్ఏ-1లో వచ్చిన మార్కుల ఆధారంగా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అధిక ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నారు.
ఉత్తీర్ణత పెంచే దిశగా..
సకాలంలో సిలబస్ పూర్తిచేయడంతోపాటు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4:45 గంటల నుంచి 5:45 వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తిచేసిన అనంతరం జనవరి నుంచి పూర్తిస్థాయిలో ప్రతి రోజూ ఒక సబ్జెక్ట్పై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించి వారిని ప్రీఫైనల్ ఎగ్జామ్స్కు సిద్ధం చేయనున్నారు.
జనవరిలో సాయంత్రం పూట తరగతులు
చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశాఖ సూచనల మేరకు ఇప్పటికే డిసెంబర్ నుంచి ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, జనవరి నుంచి సాయంత్రం పూట అదనపు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు సూచించిన సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు.
ప్రతి సబ్జెక్ట్పై అవగాహన కల్పిస్తున్నాం
విద్యార్థులకు ఇప్పటికే అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అదనపు తరగతులతో కచ్చితంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించగలమనే నమ్మకం ఉంది. పాఠశాలకు రాని పిల్లల గురించి వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం.
-యాస రాంకుమార్, తెలుగు పండిట్, పాతర్లపహాడ్
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
విద్యార్థుల్లో భయం తొలగించి పరీక్షలకు మానసికంగా సిద్ధం చేస్తున్నాం. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఇందుకు ప్రతి పాఠశాలలో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల హాజరుపై చర్యలు తీసుకుంటున్నాం. అదనపు టీచర్లకు ప్రత్యేక తరగతుల బాధ్యతను అప్పగిస్తున్నాం.
-జి.కళారాణి, జిల్లా కామన్బోర్డు పరీక్షల సెక్రటరీ, సూర్యాపేట