– తక్షణం స్పందించిన నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు
– బాధితుడి నుండి రూ.18 లక్షలు బదిలీ కాకుండా కాపాడిన వైనం
– సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
– సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ
నల్లగొండ సిటీ, డిసెంబర్ 19 : డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుడి వద్ద నుండి నగదు బదిలీ కాకుండా కాపాడడం జరిగింది. నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకుని అతనికి ఫోన్ కాల్ చేశారు. బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే తామిచ్చే అకౌంట్ నంబర్కు వెంటనే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి బెదిరింపులకు భయపడి బాధితుడు ప్రకాశం బజార్లోని ఎస్బీఐ బ్యాంక్కి వెళ్లి రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని మేనేజర్ను కోరాడు.
దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తక్షణమే సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ విష్ణుకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని దేవేందర్ రెడ్డిని విచారించగా జరిగిన సంఘటన తెలపగా అతడికి వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్ను పరిశీలించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా వారు తడపడుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు గాని బెదిరించడం, భయపెట్టడం చేయరన్నారు. వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయరన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి కాల్స్ వస్తే నమ్మకుండా వెంటనే www.cybercrime.gov.in నందు లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. సకాలంలో స్పందించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన నల్లగొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.