LPG e-KYC | నల్లగొండ, డిసెంబర్ 30 : గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ రావాలంటే.. ఈకేవైసీ చేయించుకోవాలని, మహిళల పేరుతో కనెక్షన్ ఉండాలనే అపోహ ఉన్నది. దీంతో వినియోగదారులు వారం రోజులుగా గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు దీరుతూ ఇక్కట్లు పడుతున్నారు. పనులన్నింటినీ వదిలేసి ఉన్న పళంగా ఏజెన్సీల వద్దకు పోయి రోజంతా లైన్లో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా క్యూలో ఉండి తిండితిప్పలు మాని ఈకేవైసీ చేయించుకుంటున్నారు.
అయితే.. ఈకేవైసీ అనేది నిత్యం నిర్వహించే ప్రక్రియ. పైగా గ్యాస్ ఏజెన్సీలే వినియోగదారుల ఇండ్లకు వెళ్లి చేయాల్సి ఉన్నది. కానీ.. ఈ విషయంపై వినియోగదారులకు అవగాహన కల్పించడం లేదు. మరోవైపు కేవైసీ చేసినా, చేయకపోయినా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆగిపోయే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు చెప్పకుండా తమ ఆఫీస్ వద్దనే ఆయిల్ కంపెనీలు ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తున్నాయి. దాంతో కస్టమర్లు పొద్దంతా ఏజెన్సీల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ.500కే సిలిండర్ ఇస్తుంది. దీనికి గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవీసీ చేయించుకోవాలి. పురుషుల పేరు మీద కాకుండా మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే సబ్సిడీ డబ్బు వస్తుంది.’ అని తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో ఈకేవైసీ చేసుకోవడానికి వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అయితే.. ఈకేవైసీ అనేది కేంద్రం ఆదేశాల మేరకు నిత్యం నిర్వహించే ప్రక్రియ.
అసలు వినియోగదారు ఉన్నారా.. లేరా? ఉంటే ఎవరు.. ఆయన ఆధార్, ఫోన్ నంబర్ వివరాలు తీసుకొని అప్డేట్ చేపట్టాలి. ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలకు కేంద్రం ఆదేశానుసారం ఆయిల్ కంపెనీలు ఇచ్చిన టాస్క్. దీన్ని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే వినియోగదారుడి ఇంటి కి వెళ్లి ఉచితంగా పూర్తి చేయాలి. ఇందుకోసం ఆయిల్ కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు ఏఈపీఎస్ అనే అప్డేట్ మిషన్ను అందజేశాయి. ఈ మిషన్లను గ్యాస్ డెలివరీ బాయ్స్ కు ఇవ్వాల్సి ఉండగా.. వారి వద్దే ఉంచుకొని ఏజెన్సీల వద్దకు వస్తున్న వినియోగదారుల ఈకేవైసీ చేస్తున్నారు. దాంతో కస్టమర్లు వారం రోజులుగా ఆయా ఏజెన్సీల కార్యాలయాల వద్ద బారులు దీరుతున్నారు.
ఈ నెల 28నుంచి జనవరి 6వరకు ప్రజా పాలన కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ప్రభుత్వ ఆదేశానుసారం అధికార యంత్రాం గం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్ను అడిగారు. దీన్ని సాకుగా చూపి గ్యాస్ కనెక్షన్కు ఈకేవైసీ చేస్తేనే సబ్సిడీ సిలిండర్ వస్తుందని రూమర్ తీసుకొచ్చారు. పైగా పురుషుల పేరుతో కనెక్షన్ ఉంటే సబ్సిడీ రాదని.. మహిళల పేరు మీదనే ఉండాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పురుషుల పేరు మీద కనెక్షన్ ఉన్నప్పటికీ మహిళల పేరు మీద మరో కనెక్షన్ తీసుకుంటున్నారు. ప్రజా పాలన దరఖాస్తులోని అంశాలపై అధికారులకే క్లారిటీ లేకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నట్లు కొందరు అధికారులు అంటున్నారు. గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చే వారికి ఈకేవైసీ చేయకుండా ఆపితేనే ప్రజల ఇక్కట్లు తప్పనున్నాయి.
గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు ఉన్నారా.. లేరా? లేకుంటే వారి పేరుమీద ఈ కనెక్షన్ ఇంకా ఎవరైనా అక్రమంగా వినియోగిస్తున్నారా.. అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ చేయించాలి. ఏటా ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తుంది. వారు గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రక్రియ చేపడుతారు. ఇది నిరంతర ప్రక్రియ. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమం నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ కోసం ఈకేవైసీ తప్పనిసరి అనే రూమర్ బయటకు వచ్చి ప్రజా ఇబ్బందులకు కారణం అయ్యింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఈకేవైసీ చేసుకున్నా, చేసుకోకపోయినా ఆగదు అనేది ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈకేవైసీని ఆన్లైన్ లో ఇండియన్ ఆయిల్ కంపెనీ పేరుతో ఉండే యాప్లో వినియోగదారులే చేసుకోవచ్చు.
ఈకేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావద్దు. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ కోసం వచ్చిన వారే మీ గ్యాస్ కనెక్షన్, ఆధార్, ఫోన్ నెంబర్తో ఈకేవైసీ చేస్తారు. గ్యాస్ కంపెనీల నిర్వాహకులు ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలి. అధికారులకు తెల్వకుండా వచ్చే రూమర్లను నమ్మొద్దు.
– వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ
ఈకేవైసీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిత్యం నిర్వహించే ప్రక్రియ. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదు. అయినా గ్యాస్ కంపెనీలకు సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేసేటప్పుడే ఏఈపీఎస్ మిషన్తో ఈకేవైసీ చేయాలి. ఇందుకోసం ఏ ఒక్క వినియోగదారుడూ గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ చేసినా. చేయకపోయినా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం ఆగదు. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు చెప్పాలి.
– యువ వశిష్ట హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్, నల్లగొండ