అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయి. ముఖ్యంగా పత్తి, కంది వంటి మెట్టపంటలకు ఎంతో ఉపయుక్తం కానున్నాయి. ఇక నాన్ఆయకట్టులో వరినాట్లకు కూడా వర్షం మేలు చేస్తున్నది. మొత్తంగా ఈ సీజన్లో ఓ మాదిరి వర్షం కురుస్తుండడంతో హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం నల్లగొండ జిల్లాలో 12.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వానకాలం సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 6.02 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో మెజార్టీ భాగం మెట్ట పంటలదే. మంగళవారం నుంచి మూసీ కాల్వలకు సాగునీటిని విడుదల చేయగా ఈ సీజన్లో ఇంకా నాగార్జునసాగర్కు వరద మాత్రం మొదలు కాలేదు.
నల్లగొండ ప్రతినిధి, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సైతం వాతావరణం పూర్తిగా చల్లబడి ఉంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షంతో పాటు జిల్లా అంతటా ముసురుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు మాత్రం లేవు. నల్లగొండ జిల్లాలో 12.3మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మునుగోడులో అత్యధికంగా 28.6మిల్లీ మీటర్లు, పెద్దవూరలో అత్యల్పంగా 5.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో చిట్యాలలో 24.4, వేములపల్లిలో 20.8, చండూరులో 19.7, నకిరేకల్లో 16.6, కట్టంగూరులో 16.5, శాలిగౌరారంలో 15.7, నల్లగొండలో 15, మర్రిగూడలో 14.5, మాడ్గులపల్లిలో 13.9, తిప్పర్తిలో 13.8, గుర్రంపోడులో 13.2, చింతపల్లిలో 13.1, మిర్యాలగూడ, దామరచర్ల, నాంపల్లిలో 12.3చొప్పున, డిండిలో 11.8, చందంపేటలో 9.8, కనగల్లో 8.6, కేతేపల్లిలో 8.3, త్రిపురారంలో 8, గట్టుప్పల్, నిడమనూరు, అడవిదేవులపల్లిలో 7.8చొప్పున, పీఏపల్లిలో 7.7, అనుముల, తిరుమలగిరి సాగర్లో 7.2చొప్పున, దేవరకొండలో 6.3, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ములో 5.5మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్ 1నుంచి ఈ నెల 19వరకు 158.7మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 137.1మిల్లీ మీటర్ల మాత్రమే కురిసింది. 14శాతం లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో అత్యధికంగా 31.8మిల్లీ మీటర్లు, అత్యల్పంగా చౌటుప్పల్లో 5.8మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నూతనకల్, తిరుమలగిరి మండలాల్లో అత్యధికంగా 16మిల్లీ మీటర్లు, తుంగతుర్తిలో అత్యల్పంగా 13మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
సాగుకు ఉపయోగకరం
వాస్తవంగా సీజన్ ఆరంభం నుంచి సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఈ పాటికి మెట్ల పంటల సాగు పూర్తయ్యేది. చేలు కూడా ఏపుగా పెరిగేవి. కానీ జూన్ నెలాఖరు వరకు వర్షాలు లేక పంటల సాగు ఆలస్యమైంది. జూలైలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు పంటల సాగు ఊపందుకుంది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో మొత్తం 6,02,133 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తి పంట సాగైంది. జిల్లాలో మొత్తం 6.50లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 5,38,922 ఎకరాల్లో సాగైంది. 10వేల ఎకరాల్లో కంది పంట సాగు అంచనాకు గాను కేవలం 942ఎకరాల్లోనే సాగైంది. ఇతర అన్ని రకాల పంటలు కలిపి మరో 10,749 ఎకరాల్లో సాగయ్యాయి. అంచనాల ప్రకారం మరో లక్ష ఎకరాలకు పైగా మెట్ట పంటలు సాగు కావాల్సి ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తి పంట ఏపుగా పెరగడానికి తోడ్పడనుంది. అదేవిధంగా అడుగు మందులు పెట్టడానికి అనువుగా మారిం ది. మరోవైపు వరి సాగు ఇప్పటివరకు 51,525 ఎకరాల్లోనే సాగైంది. ఈ సీజన్లో మొత్తం 5.25లక్షల ఎకరాల్లో అవుతుందని అంచనా వేశారు. ఇందులో సాగర్ ఆయకట్టుదే మెజార్టీ వాటా. ఇదిగాక ప్రస్తుతం బోర్లు, బావుల కింద వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎడమ కాల్వకు నీటి విడుదల మొదలైతేనే ఆయకట్టులో వరి నార్లు పోసుకోవడంతో పాటు ఇప్పటికే బోర్ల కింద పోసుకున్న వారి వరినాట్లు మొదలుకానున్నాయి. గతేడాది జూలై 28వ తేదీన సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఎగువ కృష్ణా లో కురిసిన వర్షాలతో అప్పటికే సాగర్కు శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో మొదలైంది. దీంతో నీటి విడుదలకు మార్గం సుగుమమైంది. కానీ ఈ సీజన్లో ఇంకా అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు.
శాలిగౌరారం ప్రాజెక్టులోకి భారీగా నీరు
శాలిగౌరారం : చిన్న నీటి పారుదల తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి కుడి, ఎడమ కాల్వల ద్వారా వానకాలం సాగుకు నీరు అందించాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులోకి అనుకున్నంతగా నీరు చేరలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21అడుగులు ఉండగా ప్రస్తుతం 7అడగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ఆయకుట్టు కింద 6వేల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. ప్రాజెక్టులోకి నీరు చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.