యాదగిరిగుట్ట, జనవరి 14 : పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్య తిరు కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి.
ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన తిరువీధి సేవోత్సవం, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ధర్మ దర్శానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 33 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
వైభవంగా గోదాదేవి కల్యాణం
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆదివారం గోదాదేవి – శ్రీరంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఉదయం పాతగుట్ట (పూర్వగిరి) ఆలయంలో, రాత్రి స్వామివారి ప్రధానాలయంలో కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. గోదారంగనాయకస్వామి సేవోత్సవాలను మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. విశేష పూజ పర్వాలను ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, అర్చకులు నిర్వహించారు. రంగనాథుడు, గోదాదేవికి ఆలయ ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పట్టువస్ర్తాలను సమర్పించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో నెల రోజులుగా గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని నిర్వహించారు. నాలుగు రోజులుగా అమ్మవారికి నిరాటోత్సవం చేపట్టిన అర్చకులు ప్రధానాలయంలో గోదాదేవిని, శ్రీరంగనాథ స్వా మిని ప్రత్యేకంగా అలంకరించి సేవపై ఊరేగించా రు. ఆదివారం కల్యాణ మూర్తులుగా తీర్చిదిద్ది కల్యాణ వేడుక జరిపించారు.
స్వామివారి సేవలో డీజీపీ రవిగుప్తా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి సేవ లో డీజీపీ రవిగుప్తా దంపతులు తరించారు. వారి కి ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు ఆలయ సాం ప్రదాయ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రధానార్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిరంజీవి చౌదరి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.