నల్లగొండ రూరల్, మార్చి 18 : రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఎండిపోయిన పంట పొలాలు, నిమ్మ తోటలను పరిశీలించారు. పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్తో వరి పొలానికి నీరు అందిస్తున్న దృశ్యాలు చూశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి పంటలకు పెట్టిన పెట్టుబడి, నీళ్లు, కరెంట్ తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు కింద సాగు నీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువన ఉన్న నారాయణపురం, ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని తెప్పించి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలు ఎండిపోవడంతో పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు కూడా ఎండిపోయిన పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రికి వసూళ్ల మీద ఉన్న సోయి రైతుల సమస్యల మీద లేదన్నారు.
వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప, వంద రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదని చెప్పారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రగాల్భాలు పలుకడం తప్ప దేనికీ పనికి రారని ఎద్దేవా చేశారు. ఎంత సేపు రాజకీయాలు చేయడం తప్ప వారికి రైతుల సంక్షేమం పట్టదన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా బీఆర్ఎస్ సర్కారులో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని, సాగు నీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడామని గుర్తు చేశారు.
నమ్మి ఓట్లు వేసిన ప్రజలు, రైతుల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు కరువుపై సర్వే చేయించాలని, పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెకంట్రెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, తుమ్మల లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, ఘట్టయ్య, బడుపుల శంకర్, జంగయ్య, నారబోయిన భిక్షం, దేవేందర్, చీర పంకజ్, రావుల శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.