త్రిపురారం, మార్చి 3 : జిల్లాలో సాగునీటికి కష్టంగా మారింది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలకు నీరందే పరిస్థితి లేదు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పంటలను తడుపుతున్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన నగిరి శ్రీనివాస్ తనకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. బావి, బోరు ఉన్నప్పటికీ నీళ్లు సరిపోకపోవడంతో నెల క్రితం పొలంలో మరో బోరు వేశాడు. రెండు బోర్లు, బావి ఉన్నా నీళ్లు అందక ఎకరం పొలం ఎండిపోతున్నది.
ఈ నేపథ్యంలో బెజ్జికల్ గ్రామానికి చెందిన రైతు వద్ద ఆదివారం ట్యాంకర్ నీటికి రూ.2 వేలు చెల్లించి పొలానికి పోయించుకున్నాడు. 10 గుంటల మడికి ఐదు ట్యాంకర్ల నీరు పట్టాయని, అందుకు రూ.10 వేలు చెల్లించానని రైతు శ్రీనివాస్ చెప్పాడు. ఎకరం పొలం తడవాలంటే ఇంకా 12-15 ట్యాంకర్ల నీరు అవసరం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదికాక ఉదయం నుంచి సాయంత్రం వరకు నడి ఎండలో కాపుకాసుకుంటూ పొలంలో ఉండాల్సి వస్తుందని, గ్రామంలో మొదటి సారిగా ట్యాంకర్ ద్వారా తానే నీటిని పోయించానని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి సాగర్ ఎడమకాల్వకు నీళ్లందించాలని కోరుతున్నాడు.
చిట్యాల : మండలంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలానికి సాగు నీరందించాల్సిన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు పూర్తి కాకపోవడంతో నీటి కష్టాలు అలాగే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం నీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. మండలంలో 1,350 ఎకరాల్లో వరి వేయగా అందులో 50 శాతం వరకు ఎండిపోయే దశలో ఉన్నది. పరిస్థితులను చూసి రైతులు యాసంగిలో సగం భూములనే సాగు చేసినప్పటికీ అవి కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో 150 నుంచి 200 ఫీట్ల లోపు బోరు వేస్తే నీళ్లు పడేవని, కానీ ప్రస్తుతం 200 నుంచి 250 ఫీట్ల వరకు వేసినా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎండుతున్న పొలాలను కాపాడుకునేందుకు కొందరు రైతులు బోర్లు వేసి నీరిందించే ప్రయత్నం చేస్తుండగా మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నారు. శివనేనిగూడెం, పెద్దకాపర్తి, పిట్టంపల్లి, చిన్నకాపర్తి, ఆరెగూడెంతో పాటు దాదాపు అన్ని గ్రామాలలో పరిస్థితి ఇలాగే ఉన్నది.