కట్టంగూర్, మార్చి 20 : మండలంలోని బొల్లేపల్లి, మల్లారం, అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల పరిధిలోని ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాల్వకు నీటిని విడుదల చేయకపోవడం, మరో వైపు ఆయకట్టు పరిధిలో బావులు, బోర్లలో జలాలు అడుగంటిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వరి పైర్లు నిట్టనిలువునా ఎండిపోతుండడంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఈ మూడు గ్రామాల్లోని రైతులు 7,100 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో సుమారు 2 వేల ఎకరాలు ఎండిపోయాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటే పంట చేతికందడం కష్టమేనని రైతులు బోరుమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉదయసముద్రం నుంచి ఏఎమ్మార్పీ కాల్వకు నీళ్లు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.