భువనగిరి కలెక్టరేట్, మార్చి 26 : జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు లేక తాగు, సాగునీటికి కష్టంగా మారింది. యాసంగిలో వేసిన వరి పంటలు చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
భువనగిరి మండలంలోని గౌస్నగర్ గ్రామంలో చంద్ర మల్లయ్య అనే రైతు 3ఎకరాల్లో బోర్ల కింద వరి సాగు చేశాడు. వేసవి సమీపిస్తున్నా కొద్దీ భూగర్భ జలాలు తగ్గడంతో పంటకు నీరు అందడం లేదు. దాంతో ట్యాంకర్ ద్వారా రోజుకు రూ.2వేలు వెచ్చించి పొలానికి నీళ్లు పోయించుకుంటున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని చంద్ర మల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.