భువనగిరికలెక్టరేట్, జనవరి 31: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రిభువనగిరి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి పోలీస్స్టేషన్లో సమూల మార్పునకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా విభాగాన్ని మరింత పటిస్ట పరిచి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. అన్నివర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భద్రతను పటిష్టపరచడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
డీసీపీని కలిసిన సఖి కేంద్రం నిర్వాహకులు..
జిల్లాకు నూతనంగా వచ్చిన డీసీపీ రాజేశ్చంద్రను షార్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సఖి కేంద్రం నిర్వాహకులు మర్యాద పూర్వకంగా కలిశారు. డీసీపీని శాలువాతో సన్మానించి పుష్ప గుచ్ఛం అందజేశారు. డీసీపీని కలిసిన వారిలో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల, స్వరూప, సఖి సెంటర్ అడ్మిన్ లక్ష్మణ్, లావణ్య, సుమలత ఉన్నారు.అదేవిధంగా డీసీపీ ఎం, రాజేశ్చంద్రను 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతీమహేశ్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీపీని శాలువాతో సన్మానించి ఙ్ఞాపికను అందజేశారు.