సూర్యాపేట, మార్చి 10 : శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా గుండెపోటు బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అలాంటి సమయంలో వారిని కాపాడేందుకు ఒకే ఒక్క పరిష్కారం సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్).
ఛాతి ఎడమ భాగంపై చేతులతో ఒత్తిడి పెంచి కృత్రిమ శ్వాస అందించడం ద్వారా ప్రాణం పోసే అవకాశం ఉండడంతో ఈ విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం సూర్యాపేట జిల్లాలో ఐదుగురు డాక్టర్లను సిద్ధంగా ఉంచింది. ప్రస్తుతం పోలీస్ విభాగానికి జీవీకే ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 13 తర్వాత వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర విభాగాలైన మెడికల్, పోలీస్, మున్సిపల్, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, ఆ తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఉరుకులు, పరుగుల జీవనం.. మారుతున్న ఆహారం, పరిస్థితుల కారణంగా అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్కు గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో సీపీఆర్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఎమర్జెన్సీ విభాగాలైన మెడికల్, పోలీస్, మున్సిపల్, శిశు సంక్షేమ శాఖల సిబ్బందికి, ఆ తరువాత విద్యార్థులకు సీపీఆర్ విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జీవీకే ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు శిక్షణ ఇవ్వగా.. ఈ నెల 13 తర్వాత వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆయా శాఖల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
గుండెపోటుకు గురైన వ్యక్తిని వెంటనే సీపీఆర్తో బతికించవచ్చని ఇటీవల అనేక సంఘటనలు రుజువు చేశాయి. దీంతో ఈ విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ విధానంపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా వైద్య, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాకు చెందిన ఐదుగురు వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ సైతం సమీక్ష నిర్వహించి ఈ నెల 13 తర్వాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో గుండెపోటు అంటే 60 ఏండ్లు పైబడిన వారికి వచ్చేదనేకునేవాళ్లం. కానీ.. కొవిడ్ తర్వాత గుండెపోటుకు చిన్న, పెద్ద తేడా లేకుండా పోయింది. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు దీనికి గురవుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతోపాటు అధిక రక్తపోటు, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి వంటి కారణంతో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మధ్య వయసులో, వృద్ధాప్యంలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్ చిన్న వయసులోనే రావడంతో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధిక బరువు, జంక్ ఫుడ్, ధూమపానం, మద్యం సేవించడం, ఆర్థిక సమస్యలతో ఒత్తిడికి లోనుకావడం, ఆహారం, జీవన అలవాట్లు గుండెపోటుకు కారణమవుతున్నాయి. అయితే.. కార్డియాక్ అరెస్ట్ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా గంటపాటు వాకింగ్, వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమ చేయాలని చెప్తున్నారు.
సీపీఆర్ ఇలా..
అప్పటి వరకు సంతోషంగా ఉండి ఒక్కసారిగా ఛాతి నొప్పితో కుప్పకూలిపోవడం ఇటీవల ఎక్కువ సంఖ్యలో చూస్తున్నాం. అలా ఎవరైనా పడిపోతే వెంటనే కింద కానీ, బల్లపై కానీ వెల్లకిలా పడుకోబెట్టి రెండు చేతులతో చాతీపై బలంగా నొక్కాలి. 30 నుంచి 40 సార్లు చాతీపై బలంగా నొక్కినప్పుడు గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. అప్పటికీ గుండె కొట్టుకోకుంటే ముక్కు మూసి నోటిలో బలంగా గాలి ఊదాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీనినే సీపీఆర్ విధానం అంటారు. గుండె కొట్టుకోవడం ప్రారంభం కాగానే సమీపంలోని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ.. ఈ విధానంపై దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు. కేవలం డాక్టర్లు మాత్రమే సీపీఆర్ చేస్తుంటారు. ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలతో స్పందించిన ప్రభుత్వం.. సీపీఆర్పై శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే జీవీకే సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి సీపీఆర్పై ఒక దఫా శిక్షణ పూర్తి చేశారు. ఈ నెల 13 తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందికి, మున్సిపల్ ఉద్యోగులకు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, 108 సిబ్బంది, ఇలా ప్రజా సంబంధాలు ఉండే ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేస్తున్నాం
సీపీఆర్ విధానంతో గుండెపోటుకు గురైన వారి ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లా వ్యాప్తంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) విధానంపై శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఐదుగురు వైద్యులు శిక్షణ పూర్తి చేసుకొని వచ్చారు. ఈ నెల 13 తరువాత ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని శాఖల సిబ్బందికి సీపీఆర్ విధానంపై శిక్షణ ఇస్తాం. కళాశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తాం.
– డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యాధికారి, యాదాద్రి భువనగిరి