అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. నల్లగొండ జిల్లా ఓట్ల కౌంటింగ్కు తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో, సూర్యాపేట జిల్లా కౌంటింగ్కు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి ఒక హాల్ చొప్పున మొత్తం ఆరు కౌంటింగ్ హాల్స్ను సిద్ధం చేశారు. ఒక హాల్లో మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లను ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం, ఒక టేబుల్ను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం వినియోగించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 14 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నది.
ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 19 రౌండ్ల నుంచి 23 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఇక ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ హాళ్లల్లో వసతుల కల్పన పూర్తయ్యింది. రేపు ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో మొదలయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట లోపే పూర్తి స్థాయి ఫలితం వెల్లడికావచ్చని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో 144 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 85.71శాతం, సూర్యాపేట జిల్లాలో 92 మంది పోటీలో ఉండగా 84.83 శాతం పోలింగ్ నమోదైంది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలు కానుంది. ఇందుకోసం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలన్నింటినీ ఇక్కడికే తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షస్తున్నారు.
అయితే రేపు జరుగనున్న కౌంటింగ్ కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కౌంటింగ్ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున విశాలమైన ఆరు హాళ్లను కౌంటింగ్ కోసం ఎంపిక చేశారు. ఒక హాల్లో ఒకేసారి 14 టేబుళ్ల మీద 14 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కౌంటింగ్ టేబుళ్ల వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్లు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 8గంటలకు అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తారు. రౌండ్ల వారీగా ఈవీఎంలను కౌంటింగ్ హాళ్లల్లోకి తీసుకొస్తారు. అదే సమయంలో ఆర్ఓ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. వీటి లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు. ఒక్కో హాల్లో ఒక నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 14 టేబుళ్లపై 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 14ఈవీఎంలను ఓపెన్ చేస్తారు.
అంటే ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇలా ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్ల సంఖ్య తేలనుంది. ఆయా నియోజకవర్గాల్లోని ఒకటో నెంబర్ పోలింగ్ కేంద్రం నుంచి చివరి పోలింగ్ కేంద్రం వరకు వరుస క్రమంలో ఈ లెక్కింపు కొనసాగనుంది. అన్నీ పూర్తయ్యాక చివరలో డ్రా పద్ధతిలో ఐదు పీఎస్లకు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాకే తుది ఫలితం వెల్లడిస్తారు.
సూర్యాపేట, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్ఓ టేబుల్తోపాటు ప్రతి రౌండ్కు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈ సారి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభించనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక టేబుల్ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1201 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సూర్యాపేటలో 271, తుంగతుర్తిలో 326, కోదాడలో 296, హుజూర్నగర్ నియోజకవర్గంలో 308 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కన సూర్యాపేటలో 20 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానున్నది. కోదాడలో 23, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాలకు సంబంధించి 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్ర లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి లెక్కింపు పూర్తి కానుంది. దేవరకొండలో 310 పోలింగ్ కేంద్రాలు ఉండగా దీని ఫలితం 23 రౌండ్ల లెక్కింపుతో పూర్తి కానుంది. తర్వాత మునుగోడులో 307 పోలింగ్ కేంద్రాలు, నకిరేకల్లో 305, నాగార్జునసాగర్లో 299 పీఎస్లు ఉండగా.. వీటి లెక్కింపు 22 రౌండ్లల్లో పూర్తి కానుంది. నల్లగొండలో 284 పీఎస్లు ఉండగా 21 రౌండ్లు, మిర్యాలగూడలో 263 పీఎస్లు ఉండగా 19 రౌండ్లల్లో లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. తక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న చోట లెక్కింపు త్వరగా పూర్తి కానున్నది. కౌంటింగ్ ప్రారంభంలో తొలి అర్ధగంట కొంత ఆలస్యమైనా గంటకు సగటున మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావచ్చని అంచనా. ఉదయం 11 గంటల వరకే ఫలితాల ట్రెండ్ వెల్లడి కానుంది. లెక్కింపు పూర్తి కావాలంటే మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ పూర్తి చేశారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు మైక్రో అబ్జర్వర్లు కూడా ఇందులో ఉన్నారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. ఇక టేబుళ్లకు మరోవైపు ఒక్కో అభ్యర్థికి టేబుల్కు ఒకరి చొప్పున ఒక్కో కౌంటింగ్ ఏజెంటు ఉండనున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ కూడా నేడు పూర్తికానుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తోపాటు ఆయా రిటర్నింగ్ అధికారులు, కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగనుంది.
ఇక కౌంటింగ్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయగా 24గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.