నల్లగొండ, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయటంతోపాటు కుల వృత్తులు, కార్మికులు, కూలీలు, రైతులకు అండగా ఉంటూ ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని రెండు కండ్లతో చూస్తూ అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వమే అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకోని నల్లగొండలోని పరేడ్గ్రౌండ్లో జాతీయ జండా విష్కరణ చేసి ఆ తర్వాత పోలీసుల గౌరవ వందననం స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 283 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. శకటాల ప్రదర్శన, విద్యార్థుల నృత్యాలను వీక్షించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రోజుల్లోనే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్రంలో 43 వేల ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను, జేపీఎస్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతోపాటు దళిత బందు, బీసీలకు, మైనార్టీలకు లక్ష రూపాయల రుణాలు, గృహలక్ష్మి పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు.
వ్యవసాయ రంగం విస్తరణ..
వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకున్న సందర్భంలో రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10 వేల చొప్పున జిల్లాలో 4,83,179 మంది రైతులకు 5,71,423 లక్షల రూపాయలు అందజేసినట్లు గుత్తా తెలిపారు. రైతు బీమా పథకం కింద 2018 నుంచి ఆగస్టు 2023 వరకు జిల్లాలో 338.95 కోట్ల రూపాయలు అందజేయడం ద్వారా 6,779 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చూకూరిందన్నారు. రైతు రుణమాఫీ ద్వారా 2014, 2018లో లక్ష లోపు రుణం గల రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 2014-15 నుంచి 2022-23 వరకు 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 10,879 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.
సంక్షేమ రంగానికి పెద్దపీట..
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 4,66,507 కుటుంబాలకు ప్రతి నెలా 6,667 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆసరా పింఛన్ల ద్వారా అన్ని వర్గాలకు 2,11,761 మందికి 49 కోట్ల 52 లక్షల 48 వేల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. దళిత బంధుతో ఇప్పటికే జిల్లాలో తొలి విడతగా 517 కుటుంబాలకు గానూ ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున పూర్తి రాయితీతో 51.70 కోట్లు ఇప్పటికే ఇవ్వగా రెండో విడుత కింద త్వరలో 5,687 కుటుంబాలకు 568.70 కోట్ల లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పారు.
విద్య, వైద్య రంగం అభివృద్ధికి భారీగా నిధులు..
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం మొదటి విడతగా నల్లగొండ జిల్లాలో 517 పాఠశాలల్లో మౌలిక వసతుల పనులకు 175.37 కోట్లు మంజూరు చేసిందన్నారు. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్లగొండకు 36 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం కింద జిల్లాలో 15,62,850 మందికి స్క్రీనింగ్ చేసి 2,32,239 మందికి కంటి అద్దాలను అందజేసి ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా 2018లో నల్లగొండలోని గంధంవారిగూడెం రోడ్డు, ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల భూమి కేటాయించి 275 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ పథకం కింద 2017 నుంచి ఇప్పటివరకు 61,965 మందికి 80.90 కోట్ల రూపాయలను వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా..
పల్లె ప్రగతితో ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా చేయటంతోపాటు గ్రామీణ పారిశుధ్యం మెరుగుకు ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కావాల్సిన సాధనాలన్నింటినీ సమకూర్చినట్లు గుర్తుచేశారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.1,322 కోట్లను వివిధ పథకాల కింద పరిపాలన, గ్రామ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో 436.84 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రహదారుల అభివృద్ధికి వందల కోట్లను వెచ్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్కుమార్, రమావత్ రవీంద్ర కుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, గుత్తా అమిత్రెడ్డి పాల్గొన్నారు.
సాగు, తాగు నీటితోపాటు నిరంతర విద్యుత్..
ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.578.30 కోట్లకు గానూ రూ.170.60కోట్ల పనులు పూర్తైనట్లు సుఖేందర్రెడ్డి తెలిపారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు 674.67 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటి వరకు 524.92 కోట్లు ఖర్చు చేసి ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ను నీళ్లతో నింపడం జరిగిందన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.6,190 కోట్ల అంచనాతో ప్రారంభించి 2,882 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 4 విడుతలుగా చెరువుల అభివృద్ధి, కాల్వల మరమ్మతులు, నిర్మాణం పనులకు రూ.250 కోట్లు మంజూరయ్యాయన్నారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ ద్వారా 2014-15 నుంచి 2022-23 వరకు 1763 ఆవాసాలు, 7 మున్సిపాలిటీల్లో 4,44,350 నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. జనవరి 2018 నుంచి వ్యవసాయానికి రైతులకు అవసరమయ్యేంత మేరకు నిరంతర విద్యుత్ సరఫరా పథకం ద్వారా 2,25,719 మంది వ్యవసాయ వినియోగదారులకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు.