కట్టంగూర్, సెప్టెంబర్ 11 : పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా కోర్టు 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన జడిగల హరీశ్ ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరై పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ బాలిక 2018 జూలై 23న కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేశాడు. నాటి శాలిగౌరారం సీఐ క్యాస్టోరెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టులో దాఖలు చేశాడు. విచారణ సదరు వ్యక్తి దోషిగా తేలడంతో 21 ఏండ్ల జైలు శిక్ష. రూ.30 వేల జరిమానా విధిస్తూ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి ఎన్.రోజా రమణి తీర్పు వెల్లడించారు.