నల్లగొండ : వానకాలం దాన్యం కొనుగోళ్ల పై సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలు, గన్నీల కొరత, ధాన్యం రవాణా, కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులు లాంటి సమస్యలు ఉంటే రైతులు గాని, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు గాని కంట్రోల్ రూమ్ నంబర్ 9963407064 కు ఫోన్ చేసి తెలుపాలన్నారు.
కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు. వానకాలం సీజన్ కు సంబంధించి ఫోన్ లో వచ్చిన సనస్యలు రిజిస్టర్ లో నోట్ చేసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారం చేస్తారని, కంట్రోల్ రూమ్ ఇంచార్జి లు ప్రతి రోజు అదనపు కలెక్టర్ కు సనస్యలు వివరిస్తారని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం లో జిల్లా పౌర సరఫరాల శాఖ,మార్కెటింగ్ శాఖలు వరి మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలపై రూపొందించిన పోస్టర్ ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్, డి.ఆర్.డి.ఓ.డి.పి.యం. అరుణ్, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, నల్గొండ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.