తాటిపాముల వద్ద బిక్కేరు వాగులో నిర్మించిన చెక్డ్యాం
తిరుమలగిరి, డిసెంబర్ 18 : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కాల్వలు, చెక్డ్యామ్లతో సాగునీరు అందిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ప్రాంతమైన తుంగుతుర్తి నియోజకవర్గం సాగునీటితో పరవళ్లు తొక్కుతున్నది. దాంతో నాడు నెర్రెలు బారిన బీళ్లు నేడు పాడి పంటలతో కళకళలాడుతూ వ్యవసాయం పండుగలా మారింది. ఈక్రమంలో నిమోజకవర్గంలోని మండలాల నుంచి ప్రవహిస్తున్న మూసీ, బిక్కేరు వాగుల వెంట ఇసుక బోర్లు (పిల్టర్ పాయింట్లు)వేసుకొని వేలాది ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఒక్కో గ్రామ పరిధిలో 150 నుంచి 200 పైగా ఇసుక బోర్లపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు.
పెరిగిన భూగర్భజలాలు
నియోజకవర్గంలోని మోత్కూర్, అడ్డగూడూరు, తిరుమలగిరి, నాగారం, మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చొరవతో ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు ప్రారంభించి చెక్డ్యామ్లు నిర్మించింది. కొన్నిచోట్ల చెక్డ్యామ్లు పూర్తి కాగా మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నాయి. ఈ చెక్డ్యామ్లు నిర్మించిన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఇసుకలో భూగర్భజలాలు పెరుగుతాయి. ఒక్కో చెక్డ్యాం పరిధిలో 1,500 నుంచి 2 వేల ఎకరాలకు ఇసుక బోర్ల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలు ఈ బిక్కేరు వాగు నుంచే తాగునీటి సౌకర్యం కూడా పొందుతున్నాయి. ఈ చెక్డ్యామ్లతో వేసవిలోనూ ఇసుక బోర్లు వట్టిపోయే పరిస్థితి ఉండదు.
ప్రయోజనం పొందే గ్రామాలు..
ధర్మారం, చిన్నపడిశాల, తాటిపాముల, నందాపురం, అనంతారం, కోటమర్తి, లక్మీదేవికాల్వ, ఈటూరు, వర్ధమాన్కోట, మాచిరెడ్డిపల్లి, కొండగడప, మోత్కూర్, వస్తాకొండూరు, జానకిపురం, చిర్రగూడూరు, సదర్శాపురం గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి సౌకర్యం మరింతగా పెరిగే అవశం ఉన్నది.
చెక్డ్యామ్ల నిర్మాణం-నిధులు..
ఎమ్మెల్యే చొరవతో నిర్మాణం
బిక్కేరు వాగులో చెక్డ్యాం నిర్మించాలని ఎంతో కాలంగా కోరుతున్నాం. అయినా ఎవరూ నిధులు మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నిధులు మంజూరు చేయించి చెక్డ్యామ్లు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగి ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. దాంతో రైతులకు సాగునీటి కష్టాలు తీరుతున్నాయి.
-ఎర్ర శోభ, సర్పంచ్, తాటిపాముల
చెక్డ్యామ్లతో ఎంతో మేలు
మా ప్రాంతంలో ఒక్కో గ్రామంలో 150 నుంచి 200 వరకు ఇసుక బోర్లుంటాయి. వేసవిలో ఇసుక బోర్లుకు నీరు అందక ఇబ్బందులు పడేవాళ్లం. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కృషితో ఈ చెక్డ్యామ్ల నిర్మాణంతో వేసవిలోనూ నీరు లభించి పంటలు మరింత సాగవుతున్నాయి. వీటితో మా ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతున్నది.
– కారుపోతుల నరేశ్, అనంతారం