జిల్లాల పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలయాలతోపాటు అధికారులు దగ్గరయ్యారు. అధికారుల పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జిల్లాతోపాటు పెరిగిన రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు, గ్రామ పంచాయతీలతో పాలన మెరుగైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు కొత్తగా 5 మండలాలు పెరిగి 23కు చేరాయి. నాడు సూర్యాపేట రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉండగా నేడు కోదాడ, హుజూర్నగర్ డివిజన్ కేంద్రాలయ్యాయి. గ్రామ పంచాయతీల సంఖ్య 323 నుంచి 475కు చేరింది. మున్సిపాలిటీలు మూడు నుంచి ఐదు అయ్యాయి.
సూర్యాపేట జిల్లాగా 2016 అక్టోబర్ 11న పురుడుపోసుకున్న నాటి నుంచి ప్రజల్లో అవధులు దాటిన ఆనందం కనిపిస్తుంది. ప్రజల చెంతకు వెళ్లి పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన సత్ఫలితాలిస్తున్నది. గత ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఈ ప్రాంత ప్రజలు ఏండ్ల తరబడి అనేక వ్యయప్రయాసాలకు లోనయ్యారు. ఎంతో కాలంగా అనేక సమస్యలతో ప్రజలు సతమతమతున్నా.. గత ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికీ రాని ఆలోచన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రావడం, మంత్రి జగదీశ్రెడ్డి రూపంలో సూర్యాపేట జిల్లా కావడం తెలిసిందే. జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు ఉండగా, పూర్వ నల్లగొండ జిల్లాకు వెళ్లేందుకు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని 60 నుంచి 70 శాతం గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడేవారు.
పూర్వ నల్లగొండ జిల్లా నుంచి నాలుగు నియోజకవర్గాలతో నూతనంగా సూర్యాపేట జిల్లా ఏర్పడడంతో జిల్లా ప్రజలకు అనేక వ్యయప్రయాసాలు తగ్గిపోయాయి. పూర్వ జిల్లా కేంద్రంలో ఏదైనా పని కోసం వెళ్తే రానుపోను దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. దాంతో సమయాభావం వల్ల రెండు, మూడు పనులు ఉంటే ఒక్కరోజులో చేసుకునే పరిస్థితి ఉండకపోయేది. దీనికితోడు ఆర్థిక భారం పడేది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల కష్టాలు అన్నీఇన్నీ కావు. నేడు సూర్యాపేట జిల్లాగా అవతరించడంతో ప్రయాణ వ్యథ, ఆర్థిక భారం తగ్గడంతోపాటు చిన్న జిల్లా కారణంగా అధికారులు తమ ఊళ్లల్లోనే ఉన్నారన్న భావనతో సులువుగా పనులు జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో పెరిగింది.
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ప్రజలకు గత నల్లగొండ జిల్లాకు వెళ్లేందుకు 55 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రాగా, నేడు ప్రజల వద్దకే జిల్లా కేంద్రం వచ్చింది. అలాగే జిల్లాలోని ఇతర నియోకజవర్గాల వారీగా పరిశీలిస్తే.. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు, మఠంపల్లి మండలాలకు చెందిన 80 శాతం గ్రామాల ప్రజలు గతంలో నల్లగొండకు వెళ్లాలంటే రెండు బస్సులు మారి దాదాపు 90 నుంచి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
నేడు సూర్యాపేటకు 40 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే సూర్యాపేట జిల్లాకు చేరుకుంటున్నారు. మిగిలిన మండలాలైన హుజూర్నగర్, మేళ్లచెర్వు, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల ప్రజల పరిస్థితి కూడా ఇదే స్థాయిలో ఉంది. వీరికి రెవెన్యూ డివిజన్ కోదాడ కావడంతో పనుల కోసం వెళ్లేందుకు దూరభారం తగ్గిపోయింది. కాగా, కోదాడ పట్టణంతోపాటు 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాల వారు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 100 నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణించగా, నేడు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోకి జిల్లా కేంద్రం వచ్చేసింది.
ప్రధానంగా మోతె, అనంతగిరి, చిలుకూరు, కోదాడ, నడిగూడెం మండలాల ప్రజలు గతంలో నల్లగొండకు వెళ్లేందుకు 100 నుంచి 140 కిలోమీటర్ల దూరం అనేక అవస్థలకు గురౌతూ ప్రయాణించేవారు. నేడు 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు గతంలో నల్లగొండకు వెళ్లాలంటే విధిగా సూర్యాపేటకు వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి తప్ప మరో దారి లేదు. ప్రధానంగా మద్దిరాల, నూతనకల్, తుంగతుర్తి మండలాల ప్రజలు గతంలో 70 నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రాగా, నేడు కేవలం 25 నుంచి 50 కిలోమీటర్ల దూరానికే జిల్లా కేంద్రం చేరువైంది. అలాగే అర్వపల్లి, నాగారం మండలాల ప్రజలు గతంలో 70 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించేవారు. కాగా, నేడు 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం రావడంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
నూతన జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత సులభతరమైంది. గతంతో జిల్లాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తే రోజంతా పట్టేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో సామాన్య ప్రజలకు పాలనా వ్యవస్థ మరింత చేరువైంది. ఎవరికి ఏ బాధలున్నా జిల్లా అధికారులకు విన్నవించుకునేందుకు తక్కువ సమయంలోనే అక్కడికి వెళ్లి తమ పని చూసుకుని తిరిగి వచ్చి ఇంటి వద్ద పనులు యథావిధిగా చేసుకునే అవకాశం లభించింది. అలాగే ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలకు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయి. అధికారులు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.
– కీత రామారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, కీతవారిగూడెం, గరిడేపల్లి
కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజల చెంతకు చేరింది. గతంలో జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి వందల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. జిల్లా విస్తీర్ణం తగ్గడంతో అధికారులకు పని భారం తగ్గింది. ప్రజలకు, అధికారులకు సత్సంబంధాలు ఏర్పడి జాప్యం తగ్గింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల తీరు పర్యవేక్షణ వేగవంతమైంది. ప్రజలకు దూరభారం, రవాణా ఖర్చులు తగ్గాయి. పనులను సత్వరమే చక్కబెట్టుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఖ్య పెరిగింది. విద్య, వైద్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వివాదాలు సత్వరమే
పరిష్కారమవుతున్నాయి.
-వేముల వెంకటేశ్వర్లు, తెలుగు లెక్చరర్, కేఆర్ఆర్ కళాశాల, కోదాడ
ఉపాధ్యాయులు గతంలో ఏ పని ఉన్నా నల్లగొండకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇక్కడే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఉండడంతో దూరభారం తగ్గడంతో పాటు పరిపాలన చేరువైంది. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగింది. గతంలో జిల్లా పెద్దగా ఉండడంతో జిల్లా అధికారులు అన్ని పాఠశాలలను సక్రమంగా పర్యవేక్షించేవారు కాదు. కానీ, జిల్లా ఏర్పాటు తరువాత పర్యవేక్షణ ఎంతో పెరిగింది. దాంతో ఉపాధ్యాయుల పని తీరులో మార్పు వచ్చింది. గతంలో జీపీఎఫ్ లోన్ కోసం నల్లగొండ వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడే చేస్తుండడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-రేపాక లింగయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట
ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా కార్యాలయంలో పని ఉంటే నల్లగొండ జిల్లా కేంద్రానికి సుమారు 90కిలో మీటర్లు వెళ్లాల్సి ఉండేది. గతంలో జిల్లా ఎస్టీఓకు వెళ్తే ఉదయం, సాయంత్రం ఒక్కో బస్సు మాత్రమే ఉండేవి. బస్సుల సమస్యతోపాటు పనులు త్వరగా కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాగా సూర్యాపేటను ఏర్పాటు చేయడంతో కేవలం ఈ ప్రాంత ప్రజలకు 40కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం ఉంది. బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ దవాఖానలు ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బంది లేకుండా తమ పనులను చేసుకుంటున్నారు. జిల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలంతా రుణపడి ఉండాలి.
-ఓరుగంటి సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగి, తుంగతుర్తి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. గతంలో ప్రతి చిన్న పనికి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం వెళ్తే వచ్చే సరికి రాత్రి అయ్యేది. సరిపడా అందుబాటులో బస్సులు లేక అనేక అవస్థలు పడేవాళ్లం. ఒకసారి వెళ్తే పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు. పదిసార్లు తిరిగి వేసారాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అలా లేదు. సూర్యాపేట జిల్లా ఏర్పాటు కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ఇది జిల్లా ప్రజలు అదృష్టంగా భావించాలి. సూర్యాపేట జిల్లా కేంద్రమైన తరువాత గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి జరిగింది. ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రావడంతో యువతకు ఉపాధి దొరుకుతుంది.
-దండ శ్యాంసుందర్రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సూర్యాపేట