– ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదు, 420 హామీలు నెరవేర్చలేదు
– ఇవి అడుగుతూ నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి వారి దౌర్జన్యానికి పరాకాష్ట
– నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండ
నల్లగొండ, సెప్టెంబర్ 07 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతూ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.. బీఆర్ఎస్ ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను నెరవే ర్చలేదన్నారు. ఈ హామీలు నెరవేర్చలని అసెంబ్లీలో నిలదీయడానికి బ్లాక్ షర్టులతో నిరసన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలపై దాడి చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. మహిళా ప్రజా ప్రతినిధులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై పోలీసులు దాడులు చేసి చీరలు లాగటాన్ని ఆయన ధృతరాష్ట్రుల పాలనలో దుశ్శాసనపర్వంగా అభివర్ణించారు. అసెంబ్లీ పెడతానని చెప్పి ఐదు రోజులకే కుదించి ఆ ఐదు రోజులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండొద్దని కుట్రతోనే ఈ దాడులు చేసినట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు కీలుబొమ్మగా మారారని వారిని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన రూ.15,000 భరోసా రూ.4,000 పెన్షన్, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు హామీలు ఎక్కడ పోయాయి, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారు ఇస్తాం అన్నదే తాము అడుగుతున్నామని, కొత్తవి ఏవీ అడగడం లేదన్నారు. ఈ దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో తగిన శిక్ష తప్పదని కంచర్ల హెచ్చరించారు.
అనంతరం జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. నిరసన తెలపడానికి నల్ల అంగీలు వేసుకొస్తే వారికి అంత ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. అయితే కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టరేట్కు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో ఆంక్షలు పెట్టి 15 మందిని మాత్రమే అనుమతించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున్రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, అభిమన్యు, శ్రీనివాస్, మారగొని గణేష్, కరణ్, జయరాజ్, రైతుబంధు జనార్ధన్, కోట్ల అశోక్ రెడ్డి, పేర్ల అశోక్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ప్లాప్ : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలుసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంపై కలెక్టర్ చంద్రశేఖర్ పై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టరేట్ ఎదుట నిరసన అనంతరం ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ పలు సమస్యలను ప్రస్తావిస్తూ కలెక్టర్ గారు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న క్రమంలో డీఈఓతో పాటు ఆర్ఐవోలకు కలెక్టర్గా మీరు ఎందుకు కాల్ చేసి పిల్లల్ని పంపొద్దు అన్నారని అడిగారు. కలెక్టర్గా అందరి సమస్యలు పట్టించుకోవాలి కానీ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వినడం ఎంతవరకు సమంజసం అన్నారు.
గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించి డ్రా పద్ధతిలో అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. వారిలో 200 మందికి పైగా పేర్లు మార్చి ఒక్కొక్కరు దగ్గర నుండి రూ.3 లక్షల నుండి 4 లక్షలు వసూలు చేసి ఇల్లు అమ్మినట్లు తెలిపిన ఆయన దీనిపై విచారణ చేసి అనర్హులకు ఇచ్చిన ఇండ్లను రద్దు చేయాలని కోరారు. రూ.234 కోట్లతో ఐటీ టవర్ నుండి పచ్చల, ఛాయా సోమేశ్వరాలయం వరకు రోడ్డు పనులు, ట్యాంక్ బండు, కళాభారతి కోసం నిధులు కేటాయించి టెండర్ కూడా పిలిస్తే దాన్ని రద్దుచేసి ఆ డబ్బులతో అధికార పార్టీ నేతల సొంత వెంచర్ల వద్ద రోడ్లు వేసుకున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా రాఘవ కన్స్ట్రక్షన్ చేపడుతున్న రూ.50 కోట్ల రోడ్డు పనుల్లో నాణ్యత లేదని వేసిన వెంటనే పై లేయర్ పోయిందని రూ.216 కోట్లతో తాము విడుదల చేసిన యూజుడి పనుల్లో కూడా నాణ్యత లేదన్నారు. వీటిపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.